- మరమ్మతులు చేపట్టిన కేటీఆర్
- 8వతేదీన మళ్ళీ జిల్లాకు రాక
- జిల్లా చుట్టూ కేటీఆర్ చక్కర్
- భారీ సభలకు ఎమ్మెల్యేల సన్నాహాలు
గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి అన్ని కీలక సమయాల్లో వెన్నుదన్నుగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ పునాదులు బలహీనపడ్డాయని ఈ మధ్యకాలంలో చర్చ సాగుతోంది. ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో కేటీఆర్ జిల్లాలోని ఒక్కో సెగ్మెంట్ వారీగా దృష్టిని పెట్టి పార్టీ పట్టుసడలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అనుకుంటున్నారు.
అందులో భాగంగా జిల్లా చుట్టూ కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చక్కర్లు కొడుతున్నారు. అవకాశం చిక్కితే చాలు అక్కడ వాలిపోతున్నారు. పర్యటనలతో హంగామా సృష్టిస్తున్నారు మంత్రి రాకకు మూడు రోజుల ముందు మంత్రి వచ్చి పోయిన తర్వాత మూడు రోజులు చర్చ జరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు అధికారులు హడావిడి చేస్తున్నారు. జిల్లా పై ప్రత్యేకంగా కేంద్రీకరిస్తున్నారు.
అభివృద్ధి పనుల ప్రారంభంతో పాటు అదనంగా హామీలు కూడా ఇస్తున్నారు. ఈ మేరకు మంత్రులు ఎమ్మెల్యేలు సభలసాక్షిగా కేటీఆర్కు సమస్యల వినతులు చేస్తున్నారు. త్వరలో ఎన్నికలు ఉన్నందున అధికార పార్టీ కీలక నేతగా, ముఖ్యమైన మంత్రిగా శ్రద్ధ కనబరుస్తున్నారు. జిల్లా పై పట్టు కోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. తన పరిధిలోని కాని వాటికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానంటూ హామీ ఇస్తున్నారు. కేటీఆర్ పర్యటనలు ఎన్నికల సభను తలపిస్తున్నాయి.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: (Warangal) వరంగల్ జిల్లా చుట్టూ మంత్రి కేటీఆర్ (Minister KTR) చక్కర్లు కొడుతున్నారు. ఈ మధ్య హుజురాబాద్, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్లలో కేటీఆర్ అధికారికంగా పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొన్ని శంకుస్థాపనలు చేశారు. మరికొన్ని హామీలు కూడా ఇచ్చారు.
ఈటెల టార్గెట్గా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తదుపరి గత నెల 23న భూపాల్ పల్లి (BHUPALPALLY) జిల్లా కేంద్రంలో, 27న స్టేషన్ గన్పూర్ నియోజక వర్గం వేలేరు మండలం షోడశపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటించి భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్, బీజేపీ రాజకీయ పార్టీలపై విమర్శలు చేశారు.
8న తొర్రూరు, పర్వతగిరి, హనుమకొండలలో పర్యటన
ఈనెల 8వ తేదీ బుధవారం రోజున మంత్రి కేటీఆర్ (KTR)మరోసారి వరంగల్ జిల్లాలో పర్యటించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హనుమకొండలో జరిగే మహిళా దినోత్సవంలో మంత్రి సత్యవతి రాథోడ్తో సహా భాగస్వామ్యం అవుతారు. తదుపరి వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని ఏనుగల్లు (Enugallu) గ్రామంలో జరిగే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. తరువాత పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు (Thorrur) పట్టణంలో పర్యటించి అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు మంత్రి ఎర్రబెల్లి ప్రయత్నిస్తున్నారు. తదుపరి బహిరంగ సభ ములుగులో (Mulugu) నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
గులాబీ పునాదులు బలహీన పడ్డాయా?
ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు (Assembly segments) ఉన్నాయి. ఒక్క ములుగు అసెంబ్లీ తప్ప అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అన్ని కీలక సమయాల్లో వెన్నుదన్నుగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీ పునాదులు బలహీన పడ్డాయని ఈ మధ్యకాలంలో చర్చ సాగుతోంది.
ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలపై ఎక్కడా లేని వ్యతిరేకత క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ రానున్న ఎన్నికలకు ఇది పెద్ద ప్రమాద సూచికగా మారింది. ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెగ్మెంట్లను తమ సొంత జాగీర్గా మార్చుకొని భూ ఆక్రమణలు, కమిషన్ దందాలు, కాంట్రాక్టులు, అన్నిటా వారిదే పెత్తనంగా సాగుతోంది.
దీంతో ఎమ్మెల్యేలు అంటే జనంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఇప్పటికే దీనిపై అధిష్టానం చేపట్టిన సర్వేలలో బలహీన పడ్డ పునాదులు తేలిపోయాయి. ఉత్తర తెలంగాణలో కీలకమైన వరంగల్లో పార్టీ పరిస్థితి దయనీయంగా మారితే రానున్న ఎన్నికల్లో విజయం అసాధ్యం అనే విషయాన్ని గుర్తించారు.
ప్రత్యేక కేంద్రీకరణ చేసి మరమ్మతులు చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ బాధ్యత తీసుకొని రానున్న ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలని అంశం ఆయనే నిర్ణయించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. అందుకే సీనియర్, జూనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్కు సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతుంది.
అనధికార ముఖ్యమంత్రిగా వ్యవహారం
రాష్ట్ర మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో వరుస పర్యటనలు చేస్తున్నారు. తమ శాఖతో పాటు ఇతర శాఖల అభివృద్ధి పనులకు హామీలిస్తూ అనధికారిక ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేత కేసిఆర్ తర్వాత తనదే బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే స్థాయిలో అధికారుల హంగామా, హెలిపాడ్, ప్రారంభ ఏర్పాట్లు చేస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ ఇప్పటికే పలుమార్లు మంత్రి దయాకర్ రావు బహిరంగంగా వ్యాఖ్యానించారు.
- ఎన్నికల సభలను తలపిస్తున్న జనసమీకరణ
(ASSEMBLY) అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రారంభాలకే పరిమితం కాకుండా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ జన సమీకరణ చేస్తున్నారు. విపక్ష రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకు పడుతున్నారు. మొత్తం ఈ వ్యవహారాలను పరిశీలిస్తే ఎన్నికల ప్రచార సభలను (Elections meetings)తలపిస్తున్నాయి.