MP | రాష్ట్రాల వారీగా టాప్లో కేరళ పార్టీల వారీగా తృణమూల్ కాంగ్రెస్ ఏడీఆర్ నివేదికలో వెల్లడి విధాత, న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో ప్రస్తుతం ఉన్న 763 మంది ఎంపీల్లో 40శాతం మందిపై అంటే.. 306 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఉన్నవారి సగటు ఆస్తులు 50.03 కోట్లు ఉంటే.. కేసులు […]

MP |
- రాష్ట్రాల వారీగా టాప్లో కేరళ
- పార్టీల వారీగా తృణమూల్ కాంగ్రెస్
- ఏడీఆర్ నివేదికలో వెల్లడి
విధాత, న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో ప్రస్తుతం ఉన్న 763 మంది ఎంపీల్లో 40శాతం మందిపై అంటే.. 306 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.
క్రిమినల్ కేసులు ఉన్నవారి సగటు ఆస్తులు 50.03 కోట్లు ఉంటే.. కేసులు లేని ఎంపీల సగటు ఆస్తి 30.50 కోట్లుగా ఆ నివేదిక తెలిపింది. గత ఎన్నికలకు ముందు ఎంపీలు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
అందులోనూ 194 మంది (25%) తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని అఫిడవిట్లలో వెల్లడించారు. వాటిలో హత్య, హత్యాయత్నం, అపహరణ, మహిళలపై నేరాలు వంటివి కూడా ఉన్నాయి. రాష్ట్రాలవారీగా చూసినప్పుడు క్రిమినల్ కేసులు అత్యధికంగా ఉన్నది కేరళ ఎంపీలపైన. ఇక్కడ 73శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
తదుపరి స్థానంలో బీహార్, మహారాష్ట్ర (57% చొప్పున), తెలంగాణ (50%) ఉన్నాయి. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న ఎంపీల్లో 50శాతంతో బీహార్ అగ్రస్థానంలో ఉన్నది. తర్వాతి స్థానంలో తెలంగాణ (9%), కేరళ (10%), మహారాష్ట్ర (34%), ఉత్తరప్రదేశ్ (37%) ఉన్నాయి.
పార్టీల వారీగా చూస్తే..
బీజేపీకి చెందిన మొత్తం 385 మంది ఎంపీలకు గాను 139 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ (మొత్తం 81) 43 మందిపై (53%), తృణమూల్ కాంగ్రెస్లో మొత్తం 36 మంది ఎంపీలు) 14 మందిపై (39%)పై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
ఆర్జేడీకి మొత్తం ఆరుగురు ఎంపీలు ఉంటే.. ఐదుగురిపై (83%)క్రిమినల్ కేసులు ఉన్నాయి. మహిళపై నేరాలకు సంబంధించిన కేసులను 21 మంది ఎంపీలు ఎదుర్కొంటున్నారు. అందులో నలుగురు ఎంపీలపై రేప్ కేసులు ఉన్నాయి.
సగటు ఎంపీ ఆస్తి 38.33 కోట్లు
రెండు సభల్లోని ఎంపీల సగటు ఆస్తిని 38.33 కోట్ల రూపాయలుగా ఏడీఆర్ లెక్కగట్టింది. అందులో క్రిమినల్ కేసులు ఉన్నవారి ఆస్తి విలువ సగటున 50.03 కోట్లు ఉంటే.. క్రిమినల్ కేసులు లేని ఎంపీ సగటు ఆస్తి విలువ 30.50 కోట్లుగా ఉన్నది.
తెలంగాణ నుంచి మొత్తం 24 మంది ఎంపీలు ఉంటే.. వారి సగటు 262.26 కోట్లుగా ఉన్నది. తదుపరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ (మొత్తం 36 మంది ఎంపీలు) 150.76 కోట్ల సగటుతో ఉన్నది. పంజాబ్ నుంచి మొత్తం 20 మంది ఎంపీలు ఉంటే.. వారి సగటు ఆస్తి 88.94 కోట్ల రూపాయలుగా లెక్కగట్టింది.
285 మంది బీజేపీ ఎంపీల సగటు ఆస్తి 18.31 కోట్లు ఉంటే.. కాంగ్రెస్కు చెందిన 81 మంది ఎంపీల సగటు ఆస్తి 39.12 కోట్లు. 36 మంది టీఎంసీ ఎంపీల సగటు ఆస్తి 8.72 కోట్లు. వైసీపీకి 31 మంది ఎంపీలుంటే.. వారి సగటు ఆస్తి 153.76 కోట్లుగా నివేదిక లెక్కగట్టింది. 16 మంది బీఆరెస్ ఎంపీల సగటు ఆస్తి 383.51 కోట్లు.
