MP Uttam Kumar Reddy విదేశాలకు వెళ్ళినందునే వెంకట్ రెడ్డి రాలేదు విధాత: సెల్ఫీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను తలపించేలా గొప్ప ప్రజాదరణతో సాగుతుందని పిసిసి మాజీ చీఫ్, ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 49వ రోజు గురువారం భువనగిరి చేరుకున్న సందర్భంగా 600 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో అంబేద్కర్ చౌరస్తా […]

MP Uttam Kumar Reddy

  • విదేశాలకు వెళ్ళినందునే వెంకట్ రెడ్డి రాలేదు

విధాత: సెల్ఫీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను తలపించేలా గొప్ప ప్రజాదరణతో సాగుతుందని పిసిసి మాజీ చీఫ్, ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 49వ రోజు గురువారం భువనగిరి చేరుకున్న సందర్భంగా 600 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేసి భట్టి విక్రమార్కకి కేక్ తినిపించి అభినందన, శుభాకాంక్షలు తెలిపారు.

ఎండకు ఎండి వానకి తడుస్తూ భట్టి చేపట్టిన పాదయాత్ర విప్లవాల ఖిల్లా పోరాటాలకు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన భువనగిరికి చేరుకునే నాటికి 600 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం చాలా చారిత్రాత్మకమని ఉత్తమ్ కొనియాడారు. భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో విజయానికి దోహదపడుతుందన్నారు.

భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భట్టి విక్రమార్కకి అభినందనలు చెప్పమని నాకు చెప్పారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశాలకు వెళ్లినందున భట్టి పాదయాత్రకు రాలేక పోయారన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన తాను భట్టి విక్రమార్క చేపడుతున్న పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. 40 నియోజకవర్గాల్లో 1500 కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కార్యకర్తలు, ఓటర్లు ఉన్నారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని వీడకుండా కాంగ్రెస్ ను నిలబెడుతున్నారన్నారు.

బీబీనగర్ లో ఎయిమ్స్ పూర్తి చేయాలని పార్లమెంటు సాక్షిగా గత నాలుగు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామన్నారు. బీబీనగర్ ఏయిమ్స్ కు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగేళ్ల కిందట ప్రకటన చేసిందన్నారు.

గత పార్లమెంటు సమావేశాల్లో ఎప్పటిలోగా పూర్తి చేస్తారని, ఎన్ని నిధులు ఖర్చు చేశారని కేంద్రాన్ని నిలదీయగా ఇప్పటివరకు 28 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామని లిఖితపూర్వకంగా పార్లమెంటులో నిసిగ్గుగా సమాధానం చెప్పిందన్నారు. నత్త నడకన ఎయిమ్స్ పనులు సాగుతున్నప్పటికీ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయదన్నారు.

కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పనులు చేయడం లేదన్నారు. ఎయిమ్స్ ఎప్పుడు పూర్తి చేస్తారని పార్లమెంట్‌లో అడిగిన ప్రతి సందర్భంలోను వచ్చే సంవత్సరం పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుందే తప్ప పూర్తి చేయడం లేదన్నారు.

ఎయిమ్స్ పూర్తి చేయని బిజెపి ప్రభుత్వానికి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. లక్షల కోట్లు ఖర్చుపెట్టి కాలేశ్వరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంతో కమీషన్లు దండుకోవడం తప్ప కొత్తగా ఒక ఎకరానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేదన్నారు. 42 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులు కమీషన్ల కక్కుర్తి కోసమేనన్నారు.

తెలంగాణలో ఏ ఇంటికెళ్లినా మిషన్ భగీరథ ద్వారా ప్యూరిఫైడ్ నీరు రావడం లేదని ప్రజలు చెబుతున్నారన్నారు. మంచినీళ్ల కోసం అనేక గ్రామాల్లో ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య జటిలంగా మారిందన్నారు. 40 లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులు కొలువులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

రాష్ట్రంలోని నిరుద్యోగులకు భరోసా ఇవ్వడానికి ఈ నెల 8న హైదరాబాద్ సరూర్‌న‌గర్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతున్నారన్నారు. ఈ బహిరంగ సభకు నిరుద్యోగులు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఉత్తమ్ కోరారు.

2023 డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో 2024 లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు భువనగిరి మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.

Updated On 5 May 2023 1:53 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story