Mulugu |
- 11 బీసీ కులాలను ఎస్టీ జాబితాలో కలిపే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం రద్దు చేయాలని డిమాండ్
- ఎమ్మెల్యే సీతక్కకు వినతి పత్రం అందించిన నాయకులు
- అసెంబ్లీలో సమస్య ప్రస్తావిస్తానని హామీ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు ఎమ్మెల్యే సీతక్క క్యాంప్ కార్యాలయం ఎదుట ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు గురువారం నిరసన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో 11 బీసీ కులాలను కలిపే తీర్మానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆదివాసీ ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి లో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్కకు వినతి పత్రం అందించారు.
ఆదివాసీలకు అన్యాయం: సీతక్క
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అత్యంత వెనుక బాటుకు గురైన వారిలో ఆదివాసీలం ఒకరమని ఎస్టీ జాబితాలో 11 బీసీ కులాలను చేర్చడం మూలాన విద్య,,ఉద్యోగ,ఉపాధి,రాజకీయ రంగాల్లో రిజర్వేన్లకు దూరమై, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం కనుమరుగై పోతాయన్నారు.
వెనుకబడిన వారిని వెనక్కునెట్టే కుట్రను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రాబోయే అసెంబ్లీలో ఈ విషయం పై నా గొంతు వినిపిస్తనని సీతక్క అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కబ్బాక శ్రవణ్,మన్యసీమ నాయకులు గొప్ప వీరయ్య,
తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు చింత కృష్ణ, ముద్ద బోయిన రవి, మల్లెల రామ్, రామరావు, సురేష్, సర్వేశ్, బాలరాజు, శ్రవణ్, విష్ణు మూర్తి తదితరులు ఉన్నారు.