విధాత: కింగ్ నాగార్జున తీరు ఎవరికీ అంతు పట్టడం లేదు. ఆయన సినీ పరిశ్రమలోని పెద్దలు మరణిస్తే కనీసం చివరి చూపులకు కూడా వెళ్లడం లేదు. ఆయన తండ్రి ఏఎన్ఆర్ మరణించినప్పుడు పరిశ్రమ మొత్తం కలిసి వచ్చి, కదలి వచ్చి ఆయనకు ఘనమైన వీడ్కోలు ఇచ్చింది. అంతే కాదు అలా వచ్చిన వారందరూ.. కన్నీరు పెట్టుకుంటున్న నాగ్కి ధైర్యం చెప్పారు. కానీ నాగార్జున మాత్రం తన తండ్రికి సమకాలీకులైన వారు మరణిస్తే కడచూపుకి కూడా వెళ్లడం లేదు.
నాగార్జున పుట్టింది, పెరిగింది అంతా ఇండస్ట్రీలోనే. 100 సినిమాలకు దగ్గర పడ్డాడు. ప్రతి నటుడితో… నేటి తరం, నిన్నటి తరం, కొత్త తరంతో ఆయనకు మంచి అనుబంధము ఉంది. కైకాల సత్యనారాయణతో ఆయన ఎన్నో చిత్రాలు చేశారు. నాగార్జున సినిమాల్లో సత్యనారాయణ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా, కామెడీ విలన్గా ఎన్నో పాత్రలు చేశారు. అంతేకాదు తన తండ్రి అయిన ఏఎన్ఆర్కు కైకాల ఆప్తమిత్రుడు. అలాంటి కైకాల మరణిస్తే నాగార్జున స్పందించలేదు. చివరి చూపుకు వెళ్లలేదు.
ఇక సెప్టెంబర్ 11న కృష్ణంరాజు మరణించాడు.అప్పుడు కూడా ఆయన తీరు ఇలాగే ఉంది. కృష్ణంరాజును చివరి చూపు చూసేందుకు వెళ్లలేదు. ఆ తర్వాత నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. నాగ్తో కలిసి నాగార్జున సినిమా కూడా చేశాడు. వారసుడు అనే సినిమాలో కృష్ణ నాగార్జున కలిసి నటించారు. అయినా టాలీవుడ్ సూపర్ స్టార్ మరణంపై నాగార్జున పెద్దగా స్పందించలేదు. భౌతికకాయం సందర్శించలేదు.
ఏదో ఒక ట్విట్టర్ పోస్ట్ మాత్రం పెట్టి తన సంతాపం ప్రకటించాడు. తాజాగా తన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో కీలక పాత్రలో నటించిన చలపతిరావు చనిపోయినా.. నాగార్జునలో మార్పు రాలేదు. మరణించిన వ్యక్తులను చివరి చూపు చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎన్నో వేల మైళ్ల దూరం నుంచి వస్తారు. ఎందుకంటే వారిని మనం ఇకపై చూడలేం. కాబట్టి మరణించి దూరమైన వ్యక్తుల భౌతిక కాయం సందర్శించి నివాళులు అర్పించడం మన సాంప్రదాయం. దీన్ని నాగార్జున పాటించడం లేదు.
నాగార్జున ఇలా మరణించిన పెద్దల భౌతిక దేహాలను సందర్శించి నివాళులు అర్పించకపోవడానికి కారణం చనిపోయిన వ్యక్తులను చూడాలంటే భయమా? లేక పార్థీవదేహాలను సందర్శించడం అపశకునంగా భావిస్తున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. సరే భయం వలన గానీ లేక అపశకునం వలన ఆయన నేరుగా సందర్శించకపోవచ్చు. కనీసం తన సంతాపాన్ని తెలుపుతూ ప్రతి ఒక్కరికి సమయం కేటాయించి మరి సంతాప ప్రకటన ప్రకటిస్తే అది ఒక మర్యాదగా ఉంటుంది. పెద్దలకు ఇచ్చే గౌరవం అవుతుంది.
సీఎంలే కదలి వచ్చి సీనియర్ ఆర్టిస్టులను, స్వర్గస్తులైన వారిని చూసి నివాళులు అర్పిస్తుంటే నాగ్ మాత్రం మౌనం పాటిస్తున్నాడు. కానీ ఆ విషయంలో ఆయన కుమారులు నయం. నాగచైతన్య, అఖిల్.. కృష్ణంరాజు, కృష్ణ మరణించినప్పుడు వారి భౌతిక కాయాలను సందర్శించి ప్రభాస్, మహేష్లకు మనో ధైర్యం చెప్పారు. ఇక ఇప్పుడైనా నాగార్జున ఈ విషయంలో తన తీరును మార్చుకోవాలని.. ఆయన అభిమానులు భావిస్తుండటం విశేషం.
లిప్లాక్లతో ‘మాన్స్టర్’లో లెస్బియన్గా కేక పెట్టించిన మంచులక్ష్మి..!