Telangana |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబీమా మాదిరిగానే గీత కార్మికుల బీమా అమలు చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. గీత కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే.. గీత కార్మికుల బీమా అమలు చేయనున్నారు.
పథకం కింద మృతుడి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా అందజేయనున్నారు. నేరుగా గీత కార్మికుడి ఖాతాలో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అందుకు విధివిధానాలు రూపొందించాలని మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్ గౌడ్ను సీఎం ఆదేశించారు.
కల్లు గీత కార్మికుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈత, తాటి చెట్లు ఎక్కి కల్లు గీసే సందర్భంగా ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట ఘటనలు చూస్తున్నామని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.
ఇప్పటికే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నా బాధితులకు అందడంలో ఆలస్యమవుతుందని కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా తరహాలోనే, కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.