ORR
- వేట కోట్లు చేతులు మారాయని ఆరోపణ
- టెండర్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్
- విచారణ సంస్థలన్నింటికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక
- కల్వకుంట్ల రాజ్యాంగం నడవదు
- మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి
విధాత: ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ అంశంపై కేటీఆర్ మౌనం వెనక మర్మం ఏమిటి? అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివరణ ఇవ్వాల్సిన మంత్రి కేటీఆర్ తాను ఇరుక్కు పోతానని మొఖం చాటేశాడని ఆరోపించారు.
ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్లు చేతులు మారాయనన్నారు. అయితే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. మాజర్ సంస్థ నివేదిక ప్రకారం టెండర్లు ఇచ్చామని సమర్థించుకుంటున్నారని, ఈ సంస్థపై అమెరికాలో కేసులు నమోదయ్యాయన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలో ఉండేదని, ఐఆర్బీ(IRB)కి అప్పగించేందుకు ఓఆర్ఆర్ ను హెచ్ఎండీఏ(HMDA) పరిధిలోకి తీసుకొచ్చారన్నారు. దీని వెనక గూడుపుఠానీ ఏమిటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొంటామన్న కేసీఆర్
తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు ప్రయివేటుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైవే అథారిటీ అభ్యంతరం చెప్పిందన్నారు. ఎన్హెచ్ఏఐ(NHAI) నిబంధనల ప్రకారం టెండర్లు ఇవ్వలేదన్నారు. బేస్ ప్రైస్ నిర్ణయించకుండా టెండర్ ఎవరైనా పిలుస్తారా? అని రేవంత్ అడిగారు. టోల్ గెట్ పై రోజుకు రూ.2కోట్ల ఆదాయం వస్తుంది. ఏడాదికి రూ.730 కోట్లు.. 30 ఏళ్లకు 22వేల కోట్లు ఆదాయం వస్తుందన్నారు. అలాంటి ఔటర్ రింగ్ రోడ్డుకు రూ. 16వేల కోట్లు బ్యాంకు రుణం వస్తుంది, కానీ ప్రభుత్వం తక్కువ ధరకే ప్రయివేటుకు కట్టబెట్టిందని తెలిపారు.
ఐఆర్బీ కంపెనీని ముందు పెట్టి తరువాత కేటీఆర్ బినామీ కంపెనీలతో ఇందులోకి ప్రవేశించే కుట్ర జరుగుతోందన్నారు. వీళ్లే 30 ఏండ్ల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. బేస్ ప్రైస్ పెట్టాము కానీ చెప్పం అని అంటున్నారని, అందులో ఏమైనా దేశ భద్రత, కేసీఆర్ ప్రాణం ఏమైనా ఉందా? అని అడిగారు. బేస్ ప్రైస్ చెప్పడానికి ఏమిటన్నారు. మేం లేవనెత్తిన ఏ ప్రశ్నకు అరవింద్ కుమార్ సమాధానం చెప్పలేదన్నారు. ఆర్టీఐ ప్రకారం మేం అడిగిన సమాచారాన్ని కూడా ఇవ్వలేదన్నారు.
సీబీఐ, ఈడీకి కూడా సమాధానం ఇవ్వరా? అని అడిగారు. తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలన్నారు.
తెలంగాణ ఆస్తుల్ని కేసీఆర్ ప్రయివేటుకు అమ్మడానికి వీల్లేదన్నారు. లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను అగ్గువకే ప్రయివేటుకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ కు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డీవోపీటీలో అరవింద్ కుమార్ పై ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే ఓఆర్ఆర్ అంశంపై కాగ్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.
ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని, దీనికి కేటీఆర్ కారణమన్నారు. ఇంత జరుగుతున్నా తండ్రీ కొడుకులు బయటకు వచ్చి వివరణ ఇవ్వడంలేదని ఆరోపించారు. తెలంగాణ కేబినెట్ కు అతీత శక్తులు లేవని, కల్వకుంట్ల రాజ్యాంగం ఇక్కడ చెల్లదన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు ఆదాయాన్ని 30 ఏళ్లకు తనఖా పెట్టి బ్యాంకు నుంచి 15వేల కోట్లు 48 గంటల్లో రుణం ఇప్పిస్తానని కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని ప్రభుత్వం ఈ స్విస్ ఛాలెంజ్ కు సిద్ధమా? అంటు రేవంత్ సవాల్ విసిరారు.