Revanth Reddy |
- తెలంగాణ గడ్డపై మొదటి సారిగా కాలుమోపిన ప్రియాంకగాంధీ
- పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి
విధాత: ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు తెలంగాణ పౌరుషానికి వేదికలని పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి అన్నారు. సరూర్నగర్ స్టేడియంలో జరిగిన నిరుద్యోగ యువ సంఘర్షణ సమితి సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ సమక్షంలోహైదరాబాద్ యూత్ డిక్లరేషన్ను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై మొట్టమొదటిసారిగా ప్రియాంక గాంధీగారు కాలుమోపారన్నారు. 60 ఏళ్ల కింద మా కొలువులు మాకు కావాలనే ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమం పుట్టిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 12.50 లక్షలు ఉంటే విభజన తరువాత తెలంగాణకు 5.30లక్షలు ఉద్యోగులను కేటాయించారన్నారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత 1.7 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని మొదటి అసెంబ్లీ లోనే కేసీఆర్ చెప్పారన్నారు. నాటి నుంచి ఆరు ఏళ్లు ఉద్యోగాలు భర్తీ చేయలేదని తెలిపారు. పీఆర్సీ చైర్మన్గా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బిస్వాల్ కమిటీ 1.90 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని నివేదిక ఇచ్చిందన్నారు.
ఇప్పుడు 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఇక నిరుద్యోగులకు న్యాయం జరగదన్నారు. అందుకే నిరుద్యోగులకు అండగా నిలబడేందుకు ప్రియాంక గాంధీ ఇక్కడకు వచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను అమలు చేస్తామన్నారు.
‘‘యువత భవితే కాంగ్రెస్ నినాదం… అమరుల ఆశయ సాధన కాంగ్రెస్ విధానం’’ అని రేవంత్ అన్నారు. ప్రియాంక గాంధీ నయా ఇందిరమ్మ అని అన్నారు. వేల కోట్ల ఆదాయం తెలంగాణకు వస్తుందంటే అది ఇందిరమ్మ దయేనని రేవంత్ అన్నారు.