Palle Ravikumar
- కల్లు గీతా కార్మిక కార్పొరేషన్ చైర్మన్గా పల్లె రవి కుమార్ బాధ్యతల స్వీకారం
విధాత: సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్ కు కార్పొరేషన్ చైర్మన్ పదవినివ్వడం అంటే తెలంగాణ ఉద్యమానికి గౌరవం ఇచ్చినట్లేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ కారులను గౌరవించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదన్నారు.
కల్లు గీతా కార్మిక కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్ బుధవారం పదవీ బాధ్యతల స్వీకారం కార్యక్రమానికి జగదీష్ రెడ్డి, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఎక్సయిజ్ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్, బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ లతో పాటు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో తెలంగాణ ఉద్యమంలో సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణతో కలిసి తెలంగాణ జర్నలిస్ట్ లను భాగస్వామ్యం చేసిన జర్నలిస్ట్ పల్లె రవి కుమార్ అంటూ ఆయన అభినందించారు. అందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ రవికుమార్ కు కార్పొరేషన్ చైర్మన్ పదవితో సత్కరించారని అన్నారు.
తెలంగాణ ఉద్యమ స్పూర్తితో మేధావులు, కవులు, కళాకారులు , జర్నలిస్ట్ లు తెలంగాణ పునర్ నిర్మాణం లోనూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు విచ్ఛిన్న కర శక్తులు చేస్తున్న కుట్రలను ఛేదించడంలో మేధావులు ముందుండాలని ఆయన కోరారు.