Sunil Kanugolu |
- సునీల్ కనుగోలు వ్యూహాలతోనే హస్తం అఖండ విజయం
- బీజేపీ అవినీతి వ్యూహాలను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహం
- ఎన్నికల స్ట్రాజిస్టుగా 14 ఎన్నికల్లో పనిచేసిన అనుభవం
- తొలుత పీకే టీంలో.. విభేదించి మైండ్ షేర్ అనలిటిక్స్
- సంస్థ డైరెక్టర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహారిస్తున్న సునీల్
విధాత: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం వెనుక అనేక శక్తులు అహోరాత్రులు శ్రమించాయి. అనేక వ్యూహాలను రచించి అమలుచేశాయి. వినూత్న ప్రచార వ్యూహాలను రూపొందించాయి. మోదీ షా ద్వయం ఎత్తులను చిత్తుచేశాయి. సర్వేల ఆధారంగా పార్టీ అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఈ శక్తుల నుంచి వెనుక నుంచి నడిపించిన మాస్టర్ మైండ్ సునీల్ కనుగోలు (Sunil Kanugolu). ఆయనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త.
అన్నీ తానై నడిపించిన ఎన్నికల స్ట్రాటజిస్టు సునీల్. కర్ణాటకలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలను రూపొందించించారు. బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేశారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా అవినీతిని ఎన్నికల ప్రచార అస్త్రంగా సంధించారు. కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఘనత పార్టీ నేతలు, కార్యకర్తలుతోపాటు ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్త సునీల్ కకనుగోలుకు దక్కుతుంది. సునీల్ కనుగోలు బృందం చేసిన సర్వేల ఆధారంగా కొంతమంది మినహా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రధానంగా ఎంపిక చేశారు.
గత ఏడాది నుంచి కాంగ్రెస్లో కనుగోలు
ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ను కాంగ్రెస్ పార్టీ గత ఏడాది మార్చిలో నియమించుకుంది. రెండు నెలల తర్వాత, సోనియా గాంధీ సునీల్ ను పార్టీ 2024 లోక్సభ ఎన్నికల టాస్క్ఫోర్స్లో సభ్యునిగా నియమించారు.
గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేసిన సునీల్ కనుగోలు, 2014లో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ర్ణాటకలలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వీటన్నింటిలో బీజేపీ విజయం సాధించడం గమనార్హం.
అసలు ఎవరీ సునీల్ కనుగోలు?
విజయవాడుకు చెందిన సునీల్ కనుగోలు కుటుంబం చాలా ఏండ్ల క్రితమే తమిళనాడులో స్థిరపడింది. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తిచేసిన సునీల్… ప్రపంచ దిగ్గజ సంస్థ మెక్కిన్సీలో కన్సల్టెంట్గా పనిచేశారు. ప్రశాంత్ కిశోర్ ను ఎలా అయితే ‘పీకే’గా పిలుస్తారో.. సునీల్ కనుగోలును ‘ఎస్కే’ అనే పొట్టి పేరుతో పిలుస్తారు.
2014 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్తో కలిసి బీజేపీకి జాతీయ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. 2016లో పీకే నుంచి విడిపోయి సొంతంగా అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అనే పోల్ సంస్థను నెలకొల్పారు.
తెలంగాణకు కూడా సునీల్
తెలంగాణలో అధికారం సాధించే లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సునీల్ కనుగోలు సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు సునీల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. సునీల్ హైదరాబాద్లో కార్యాలయం ప్రారంభించి రాజకీయ కదనరంగంలోకి దిగారు. గత డిసెంబర్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్ కార్యాలయంపై దాడులు చేశారు.
మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఉన్న సునీల్ కార్యాలయంలో కంప్యూటర్, లాప్ టాప్లు సీజ్ చేశారు. సీఎం కేసీఆర్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారని ఆరోపణలతో పోలీసులు కార్యాలయానికి సీజ్ చేశారు. కొంత కాలంగా ఎస్కే టీమ్ కాంగ్రెస్ కోసం పని చేస్తున్నట్లు పోలీసులు అప్పట్లో ఆరోపించారు. ఈ అంశంలో కాంగ్రెస్నేత మల్లు రవికి నోటీసులు కూడా ఇవ్వడం కలకలం రేపింది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కనుగోలు
వచ్చే పార్లమెంట్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరఫున సునీల్ కనుగోలు వ్యూహరచన చేయనున్నారు. ఈమేరకు ఇటీవల కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలతో సమావేశమై ఒప్పందం చేసుకున్నారు