విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Elections 2023) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరనున్నది. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలున్న కర్ణాటకలో ఒకే విడతలో పోలింగ్ జరుగుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా 5.31 కోట్ల మంది ఓటు వేయడానికి ఈసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది మే 13న ఎన్నికల ఫలితాల్లో తేలనున్నది.
సీఎం బసవరాజు బొమ్మై హుబ్లీలో ఓటు వేశారు. ఆయన షిగ్గాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప షికారిపురలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. షికారిపుర నుంచి ఆయన తనయుడు విజయేంద్ర పోటీలో ఉన్నారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ బెంగళూరులో, బెంగళూరు శాంతినగర్లో నటుడు ప్రకాశ్రాజ్ ఓటు వేశారు.
2024 లోక్సభఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దక్షిణ భారతంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ఇప్పటివరకు ఇక్కడ ఎన్నడూ ఆ పార్టీకి మెజారిటీ మార్కు దాటలేదు.
కానీ ప్రధాన పార్టీగా నిలుస్తున్నది. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ అధికారం కోల్పోతే ఆ పార్టీకి నైతికంగా పెద్ద దెబ్బే అని విశ్లేషకుల వాదన. అలాగే ఈ ఏడాదే జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ దీన్ని ప్రభావం ఉండే అవకాశం ఉన్నదని అభిప్రాయపడుతున్నారు.