Ponguleti
- ఖమ్మంలో బీజేపీకి ఆదరణ లేదు..
- బీజేపీలో చేరడం బీఆర్ఎస్కే లాభం
- పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరుల అసంతృప్తి
విధాత: బీజేపీ నేతలను తన ఇంటికి పిలిచిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivas Reddy) పై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తున్నది. తాము వద్దని చెబుతున్నా వారిని ఇంటికి ఆహ్వానించి, మంతనాలు చేయడంపై పొంగులేటి అనుచరులు, అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఆదరణ ఉండదని, బీజేపీకి వెళ్లడం ద్వారా ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి, పరోక్షంగా బీఆర్ఎస్ గెలువడానికే ఉపయోగ పడుతుందని పలువురు ఆయన ముఖ్య అనుచరులు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది.
‘ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ను గెలువనీయనని తొడగొడితివి.. సవాల్ విసిరితివి.. నీ సవాల్ నెరవేరాలంటే బీజేపీతో సాధ్యం కాదు’ అని మరోసారి పొంగులేటికి చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు కలువడానికి వస్తానంటే నేను ఉండటం లేదని చెప్పి ఎందుకు తప్పించుకున్నావని, రేవంత్రెడ్డిని హైదరాబాద్లో రహస్యంగా ఎందుకు కలిశావని నిలదీసిన ముఖ్య అనుచరులు.. మరి ఇప్పుడు బీజేపీ నేతలను హైదరాబాద్లోనో, రహస్యంగానో కలువకుండా నేరుగా ఖమ్మం రమ్మని ఎందుకు చెప్పావని నిలదీశారని తెలుస్తున్నది. వాళ్లు నేరుగా వచ్చారంటే.. మీ అనుమతి లేకుండా ఎలా వస్తారని అడిగినట్లు సమాచారం.
పైగా మీతో పాటు జూపల్లి కృష్ణారావు కూడా వచ్చారంటే అంతా ప్రణాళిక ప్రకారమే వచ్చినట్లు కదా? అని అడిగినట్లు సమాచారం. ‘బీజేపీతో కలిసేందుకు లేదా చేరేందుకు మీకు ఎలాంటి అభిప్రాయాలు, వాదనలు ఉన్నా.. బీజేపీతో కలిస్తే మీ శపథం, ఛాలెంజ్లు నెరవేరవు. బీఆర్ఎస్ గెలుపుకే మీరు ఉపయోగపడతారు’ అని పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నఅనుచరుడొకరు చెప్పినట్లు సమాచారం.
బీఆర్ఎస్ను అధికారంలోకి రాకుండా ఓడించాలన్న పట్టుదల లక్ష్యం ఉంటే.. మీరు పునరాలోచన చేయాలని హితవు పలికినట్లు తెలిసింది. దీంతో పునరాలోచనలో పడ్డ పొంగులేటి బీజేపీ నేతలకు తన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడి చెపుతానని సమాధానం చెప్పినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో పొంగులేటి ఏమి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై రాజకీయ వర్గాలలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది.