- నిమ్స్లో గవర్నర్ తమిళి సై పరామర్శ
- మంత్రి సత్యవతి పరామర్శ
- మంత్రి హరీశ్రావు హామీ
- ప్రీతి ఆరోగ్యస్థితిపై బులిటిన్ విడుదల
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం సంఘటనపై ఇప్పటికే అన్ని వర్గాల కేంద్రీకరణ పెరిగింది. పోలీసులు కూడా అటెన్షన్ అయ్యారు. నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు వేగం పెంచారు.
కళాశాల యజమాన్యం వేసిన ప్రొఫెసర్ల కమిటీ విచారణ కూడా ముమ్మరంగా సాగుతోంది. ప్రీతిని రక్షించేందుకు నిమ్స్ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు విద్యార్థి యువజన రాజకీయ వర్గాలు ప్రీతికి న్యాయం చేయాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనలో నిందితుడు హోంమంత్రి పేరు వినియోగించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు పోలీస్ అధికారులకు కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఈ సంఘటనల నేపథ్యంలో కేఎంసీ వద్ద శుక్రవారం కూడా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అందుకే ఎలాంటి ఒత్తిడి లకు తలగకుండా నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ పెరుగుతోంది.
నిందితుడు సైఫ్ అరెస్ట్
మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం సంఘటనలో నిందితుడు సీనియర్ పీజీ వైద్యవిద్యార్థి సైఫ్ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. మెడికో ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత ప్రీతి తండ్రి ధరావత్ నరేందర్ నాయక్ స్థానిక మట్టేవాడ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తమ దర్యాప్తును కొనసాగించారు.
ఇప్పటికే రెండు రోజుల క్రితమే సైఫ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన పద్ధతిలో విచారణ కొనసాగించినట్లు చెబుతున్నారు. తాజాగా శుక్రవారం అరెస్టు చేసినట్లు ప్రకటించారు.
ప్రతీ ఆత్మహత్యయత్నానికి సీనియర్ వేధింపులు కారణమనే ఆరోపణలు వ్యక్తమమైతున్నాయి. ఈ కారణంగా ప్రీతి బుధవారం ఆత్మహత్యకు యత్నించగా ఈ ఘటన వరంగల్లో కలకలం రేపగా రోజుకో మలుపు తీసుకుంటుంది.
గవర్నర్ తమిళ సై పరామర్శ
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతిని గవర్నర్ డాక్టర్ తమిళ సై హాస్పిటల్కు స్వయంగా వెళ్లి పరామర్శించారు. పరిస్థితిని తెలుసుకొని తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
మంత్రి హరీష్ హామీ
అదేవిధంగా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీశ్రావు కూడా ఈ విషయంపై స్పందించారు. ప్రీతికి న్యాయం జరిగేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఎలాంటి ఒత్తిడిలకు తలొగ్గకుండా ఈ ఘటనపై విచారణ చేపడుతామని హామీ ఇచ్చారు.
మంత్రి సత్యవతి పరామర్శ
నిమ్స్ లో చికిత్స పొందుతున్న మెడికో విద్యార్థిని ప్రీతిని మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. విద్యార్థిని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలంటూ వైద్యులు ఆదేశించారు.తల్లి తండ్రులతో మాట్లాడి వారిని ఓదార్చారు.అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ వైద్య విద్యార్థిని ప్రీతి సంఘటన బాధాకరమన్నారు. ఎక్మా,డయాలసిస్ల సాయంతో చికిత్స కొనసాగుతోందన్నారు. కళ్ళు తెరిచి చూడగలుగుతుంది, స్వత హాగా ఊపిరి తీసుకోగలుగుతుందన్నారు. ప్రీతిని ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు.
యంజీయంలో ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం కమిటీని నియమించిందన్నారు. ఘటన కారకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.నిమ్స్ వైద్యులకు ఆదేశాలు ఇచ్చి అన్ని రకాలుగా ప్రీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తల్లిదండ్రుల చేత మాట్లాడిస్తున్నపుడు ప్రీతీ రెస్పాండ్ అవుతుందన్నారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ప్రీతి హెల్త్ బులిటెన్ (Preethi health update)
ప్రస్తుతం ప్రీతి హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రీతీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ వైద్యులు వెల్లడించారు.
నిమ్స్ లో చికిత్స పొందుతాను వైద్య విద్యార్థిని ప్రీతికి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు శుక్రవారం బులిటిన్ విడుదల చేశారు. ఈ విధంగా ఉంది. బ్రెయిన్ కొంతవరకు స్పందన మొదలైందనీ, వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ బాగా అందుతుందని పేర్కొన్నారు.
పల్స్ మరియు BP ఇప్పటికీ మందులతో మరియు ECMO తోనే ట్రీట్మెంట్ సాగుతోందని ప్రకటించారు. ఆమె ఆరోగ్యం ఇప్పటికీ క్షీణించే ఉంది.మెరుగైన వైద్యం అందిస్తున్నాము. స్పెషలిస్ట్ వైద్యుల మల్టీడిసిప్లినరీ బృందం పర్యవేక్షణలో వైద్యం సాగుతున్నట్లు ప్రకటించారు.