విధాత: సైన్స్ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిది. మంచికి ఉపయోగించుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి. దానినే తప్పు మార్గంలో వాడుకుంటే ప్రకృతికే అది సవాల్ విసురుతుంది. పాశ్చాత్య దేశాల విషయం ఏమో గానీ, మన దేశంలో మాత్రం సరోగసి విధానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంటుంది. మాతృత్వానికి పెద్ద పీట వేసి అమ్మతనానికి ప్రాధాన్యం ఇచ్చే సంప్రదాయకమైన మన దేశంలో దీనిపై వ్యతిరేకత ఎక్కువ. అనారోగ్య పరిస్థితుల్లో అమ్మతనానికి నోచుకోని వారి కోసం ఈ విధానం వచ్చింది.
కానీ కొందరు దానిని పిల్లలు పుడితే అందం చెడిపోతుంది? అనే తరహాలో ఆలోచిస్తూ దీని వైపు చూస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈ విధానంపై సంచలన కామెంట్స్ చేసింది. 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది ప్రియాంక చోప్రా. తరువాత తమిళన్ అనే చిత్రం ద్వారా వెండితెరకు ప్రవేశించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. మోడల్గా కూడా చేసింది. ఆ తర్వాత హాలీవుడ్కి వెళ్ళింది.
అక్కడ కూడా సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీ అయ్యింది. అనంతరం అక్కడే ఆమె కంటే వయసులో పదేండ్లు చిన్నవాడైనా అమెరికా పాప్ సింగర్ నికీ జోనాస్తో డేటింగ్ చేసిం వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక కూడా ఎక్కడా తగ్గకుండా ప్రియాంక చోప్రా సినిమాలు చేస్తూనే ఉంది.
ఈ జంట చాలా సార్లు వార్తల్లో నిలిచారు. అంతర్జాతీయ వేదికలపై తన భర్తతో కలిసి హంగామా సృష్టించే ఈమె అవకాశం దొరకితే చాలు తమ రొమాంటిక్ పిక్స్తో హల్చల్ చేస్తూ ఉంటారు. కాగా గత కొంతకాలంగా ఈ దంపతులిద్దరూ సరొగసి ద్వారా బిడ్డను పొందడంపై విమర్శలు వస్తున్నాయి.
గర్భాన్ని అద్దెకు తెచ్చుకుందని రెడీమేడ్ బేబీని కొనుక్కుందని కామెంట్స్ వస్తున్నా.. ఇప్పటివరకు ఆ కామెంట్స్పై స్పందించని ప్రియాంకా చోప్రా.. తను సరొగసి విధానాన్ని ఎందుకు పాటించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చింది.
నా అనారోగ్యం కారణంగా నేను సరోగసిని ఎంచుకున్నాను. అంతేకానీ అందం తగ్గి పోతుందని ఇలా చేశాననడం నాకు బాధ కలిగిస్తుంది. సోషల్ మీడియా ట్రోల్స్ ప్రభావం నా బిడ్డపై పడ కూడదు. అందుకే నా బిడ్డ ఫోటోని ఎక్కడా చూపించలేదు.
సరోగసి కూడా అంత సులువైన పనేం కాదు. ఆరు నెలల పాటు వెతికితే ఓ మనసున్న మహిళ ఒప్పుకుంది. అందుకే ఆమె పేరు కూడా కలిసి వచ్చేలా నా కూతురికి మారుతి మాల్తీ మారీ చోప్రా జోనస్ అని పేరు పెట్టాము.
నా కూతురు పుట్టినప్పుడు నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాను. ఆమె చాలా బలహీనంగా, చిన్నదిగా ఉంది. కొన్ని రోజులు ఇంక్యూబేటర్లో ఉంచారు. దానికి నేను నా భర్త చాలా బాధ పడ్డాం. ఆ సమయంలో డాక్టర్లు, నర్సులు దేవుడి ప్రతిరూపాలుగా నిలిచి నా కూతురి ప్రాణాలను కాపాడారని చెప్పుకొచ్చింది.