High Court | శాశ్వత నివాసితులైన విద్యార్థులను ‘స్థానికంగానే పరిగణించాలి కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు వారంలోగా వారికి సర్టిఫికేట్లను అందజేయాలి ఉత్తర్వులు జారీ చేసిన సీజే ధర్మాసనం విధాత, హైదరాబాద్ : వైద్య విద్య సీట్ల భర్తీకి సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శాశ్వత నివాసితులైన విద్యార్థులను ‘స్థానికంగానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు 2023-24 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేయాలని కాలోజీ నారాయణరావు […]

High Court |
- శాశ్వత నివాసితులైన విద్యార్థులను ‘స్థానికంగానే పరిగణించాలి
- కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
- వారంలోగా వారికి సర్టిఫికేట్లను అందజేయాలి
- ఉత్తర్వులు జారీ చేసిన సీజే ధర్మాసనం
విధాత, హైదరాబాద్ : వైద్య విద్య సీట్ల భర్తీకి సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శాశ్వత నివాసితులైన విద్యార్థులను ‘స్థానికంగానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు 2023-24 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేయాలని కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని ఆదేశించింది. అయితే ప్రభుత్వ అధికారి జారీ చేసిన ఏదైనా స్థానిక సర్టిఫికేట్ను వర్సిటీకి సమర్పించాలని పిటిషనర్లకు చెప్పింది. తీర్పు వెలువరించిన(సోమవారం) నుంచి వారం రోజుల్లోగా సర్టిఫికేట్ను అందజేయాలని పేర్కొంది.
‘తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల అడ్మిషన్ (ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశం) నిబంధన-2017లోని 3(III)(B) ప్రకారం విద్యార్థిని స్థానికుడిగా పరిగణించాలంటే అర్హత పరీక్ష(నీట్)కు ముందు నాలుగేళ్లు తెలంగాణలోనే చదివి ఉండాలని చెబుతోందని.. ఈ నిబంధన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలాంటి నిబంధనను తప్పుబడుతూ గతంలో సుప్రీంకోర్టు పలు కేసుల్లో ఉత్తర్వులు కూడా ఇచ్చిందని గుర్తుచేసింది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిబంధనను పూర్తిగా ఎత్తివేయలేమంది. తెలంగాణలోని శాశ్వత నివాసితులకు 3(III)(B) నిబంధన వర్తించదని తేల్చిచెప్పింది. పిటిషనర్ల కేసు.. రూల్ 3(III)(B) కిందకు రాదని యూనివర్సిటీ తరఫు న్యాయవాది కూడా చెబుతున్నారని వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95కు ఈ రిట్ పిటిషన్ల వివాదానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ కేసులో పిటిషనర్లు తాము తెలంగాణలో శాశ్వత నివాసితులమని పేర్కొంటున్నారు.
వారు సర్టిఫికేట్ అందజేస్తే మెరిట్ ప్రకారం స్థానిక కోటాలో సీట్లు కేటాయించాలని వర్సిటీని ఆదేశించింది. హైదరాబాద్కు చెందిన ప్రశంస రాథోడ్ తల్లిదండ్రులిద్దరు ఉద్యోగులు. విధి నిర్వహణలో భాగంగా చెన్నైకి బదిలీ కావడంతో విద్యార్థి ఇంటర్మీడియట్ అక్కడే చేశారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలోనే చదువుకున్నారు. నీట్ రాసిన విద్యార్థినిని నాన్లోకల్ కోటాగా పరిగణిస్తామని అధికారులు పేర్కొన్నారు.
దీంతో ఇంటర్మీడియట్ స్థానికంగా చదవకుంటే నీట్లో లోకల్ కోటా (85 శాతం) కిందికి రారంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 114ను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన విద్యార్థి ప్రశంస రాథోడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోకల్గా పరిగణించకుంటే కేవలం 15 శాతం సీట్లలోనే తాము పోటీ పడాల్సి ఉంటుందని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఇదే తరహా పిటిషన్లను కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది.
