- మరింత ఆసక్తికరంగా మారిన సంక్రాంతి సినిమాల ఫైట్
విధాత: ఈ సంక్రాంతికి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘వారసుడు’, కోలీవుడ్ టాప్ స్టార్ తల అజిత్ నటించిన ‘తెగింపు’ చిత్రాలు తెలుగులో విడుదల కానున్నాయి.
తమిళంలో ఈ పొంగల్ రేసులో ‘తెగింపు’కు ఒరిజినల్ వెర్షన్ అయినటువంటి ‘తూనీవు’, విజయ్ నటించిన వారసుడికి ఒరిజినల్ వెర్షన్ ‘వారిసు’ పోటీపడుతున్నాయి. ఇక తెలుగుకు వస్తే తాజాగా అజిత్ నటించే ‘తెగింపు’ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. దీంతో ఈ ఏడాది సంక్రాంతికి బరిలో దిగే సినిమాల రిలీజ్ డేట్స్ అన్ని ఫిక్స్ అయ్యాయి.
జనవరి 11న తల అజిత్- డైరెక్టర్ హెచ్ వినోద్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘తెగింపు’ చిత్రం విడుదల కానుంది. ఆ మరుసటి రోజు అంటే జనవరి 12న బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘వీరసింహారెడ్డి’ విడుదల ఖరారైంది.
అయితే అదే రోజున దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘వారసుడు’ విడుదల కానుందని మొదట ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ట్రైలర్కు మిక్స్డ్ స్పందన రావడంతో.. వెంటనే దిల్ రాజు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
అజిత్ సినిమా కంటే ఒక రోజు ఆలస్యంగా వస్తే.. మొదటికే మోసం వస్తుందని భావించిన దిల్ రాజు.. ‘వారసుడు’ చిత్రాన్ని కూడా జనవరి 11నే విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దీంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జనవరి 11న బీభత్సమైన ఫైట్ జరగబోతోంది. దీంతో.. ‘వీరసింహారెడ్డి’కి కాంపిటేషన్ లేకుండా.. జనవరి 12న సోలోగా విడుదలయ్యే అవకాశం వరించింది.
ఇక జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి నటించిన బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నాలుగు చిత్రాలతో పాటు మరో రెండు చిన్న చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటించిన ‘విద్య వాసుల అహం’, అలాగే సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ జంటగా నటించిన ‘కళ్యాణం కమనీయం’ చిత్రాలు జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇక వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలలో బాలయ్య, చిరుల సరసన ఒకే హీరోయిన్ శృతిహాసన్ జోడిగా నటిస్తోంది. వారసుడు చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. మరి ఈ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు లభిస్తాయి? వంటివన్నీ త్వరలోనే తేలిపోతాయి.
ఏ చిత్రం ఎన్ని థియేటర్లలో విడుదలైనప్పటికీ వీకెండ్లో వచ్చిన సినిమాల టాక్ను బట్టి హిట్ అయిన చిత్రానికి మిగతా సినిమాలు ఆడే థియేటర్లను కేటాయించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెగింపు, వారసుడు, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య.. ఈ నాలుగు చిత్రాలు పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మాస్ యాక్షన్ మూవీస్గా రూపొందుతుండగా విద్య వాసుల అహం, కళ్యాణం కమనీయం చిత్రాలు డిఫరెంట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గా రూపొందుతున్నాయి.
ముఖ్యంగా కళ్యాణం కమనీయం చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలలో సైలెంట్ కిల్లర్ కావచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇక వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మంచి నిడివి ఉన్న పాత్రను మాస్ మహారాజా రవితేజ పోషిస్తున్న సంగతి తెలిసిందే.