- ముగిసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
- రాష్ట్ర స్థాయికి 19 ఎగ్జిబిట్లు ఎంపిక
- రూ.10 లక్షలతో సైన్స్ మొబైల్ వ్యాన్ అందజేస్తానన్న ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి
విధాత: చిన్నతనంలోనే పిల్లలకు శాస్త్ర, సాంకేతికత దృక్పథం అలవడాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధన చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక వెస్లీ ఉన్నత పాఠశాలలోని అబ్దుల్కలాం ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన శనివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.
శాస్ర్తయ దృక్పథం పెరిగినప్పుడే పిల్లలు సమాజాభివృద్ధికి దోహదపడే అద్భుత శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుతారన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న అద్భుత నైపుణ్యాలు, వారి ప్రదర్శనల ద్వారా ప్రస్పుటమయ్యాయని, ఆశ్చర్య చకితులను గావించే అద్భుత ప్రతిభ వారిలో దాగి ఉందని ఆయన కొనియాడారు. చిన్ననాటి నుంచే ఇష్టమైన రంగం వైపు పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ విద్యార్థలకు విజ్ఞానంతోపాటు మానవీయ విలువలు పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు సృజనాత్మకతతో పాటుగా ఊహకందని ప్రయోగాలను ప్రదర్శించారని విద్యార్థులను అభినందించారు. మెదక్ జిల్లాకు రూ.10 లక్షల నిధులతో సైన్స్ మొబైల్ వ్యాన్ అందజేస్తానని హామీనిచ్చారు.
జిల్లాలోని 21 మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. మొత్తం 504 ప్రదర్శనలు నిర్వహించగా సుమారు 20 వేల మంది విద్యార్థులు తిలకించి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేశారన్నారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు 19 ఎగ్జిబిట్లు ఎంపికైనట్లు వెల్లడించారు. ఉత్తమ ప్రదర్శనలు రూపొందించిన విద్యార్థులకు ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, డీఈవో రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.