Sharad Pawar
- సీనియర్ నేతల సమావేశంలో చర్చలు
- మే 6న ఎన్సీపీ కొత్త నేత ఎంపికకు సమావేశం
విధాత: ఎన్సీపీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయం నుంచి శరద్పవార్ (Sharad Pawar) వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించని తరుణంలో పార్టీకి నాయకత్వం వహించే నేతల్లో ఆయన కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సూలే పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. పవార్ తన నిర్ణయానికి కట్టుబడి ఉన్న నేపథ్యంలో పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలన్న అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు బుధవారం రాత్రి పలువురు మంత్రులు సహా సీనియర్ పార్టీ నాయకులు సుదీర్ఘమంతనాలు నిర్వహించారు.
సుప్రియా సూలే జాతీయ స్థాయిలో పార్టీ నాయకురాలు కావాలని, అజిత్పవార్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాలనే అభిప్రాయం వ్యక్తమైందని సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేత ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీకి మెజార్టీ వస్తే అజిత్పవార్ ముఖ్యమంత్రి రేసులో ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
ముంబైలోని వైబీ చవాన్ సెంటర్లో అంతకు ముందు జరిగిన చర్చల్లో సుప్రియా సూలే పేరుతోపాటు.. రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్ పేరు కూడా పార్టీ ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. అయితే.. తాను పార్టీ పగ్గాలు అందుకునే పోటీలో లేనని పటేల్ స్వయంగా ప్రకటించడంతో ఇక సుప్రియా సూలే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బుధవారం నాటి సమావేశానికి ముఖ్యనాయకత్వం అంతా హాజరైంది. విశేషం ఏమిటంటే.. సమావేశంలో పాల్గొన్న వారి అభిప్రాయాలు వినేందుకు శరద్పవార్ కూడా కూడా వచ్చారు. అయితే.. ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, పవర్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని చర్చ జరిగిన జయంత్ పాటిల్ మాత్రం హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.
అయితే, తాను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమానికి వెళ్లాల్సి ఉన్నందునే వైబీ చవాన్ సెంటర్లో జరిగిన సమావేశానికి హాజరుకాలేదని ప్రఫుల్ పటేల్ చెప్పారు. కానీ.. జయంత్ పాటిల్ మాత్రం ఈ సమాశానికి రావాల్సిందిగా తనకు ఆహ్వానం లేదని పేర్కొనడం గమనార్హం.
మే 6న నూతన అధ్యక్షుడి ఎన్నిక
ఎన్సీపీ కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకునేందుకు నిర్వహించే సమావేశం మే 6 జరుగుతుందని సమావేశానికి హాజరైన శరద్పవార్ చెప్పినట్టు తెలిసింది. నిజానికి 5వ తేదీనే ఈ సమావేశం ఏర్పాటు చేసినా.. వాయిదా పడింది. ఆ రోజు కమిటీ సమావేశం నిర్ణయానికి తాను బద్ధుడనై ఉంటానని శరద్పవార్ చెప్పారు. వాస్తవానికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు తాను పార్టీ సీనియర్లను సంప్రదించాల్సిందని అన్నారు. కానీ.. తాను ముందు సంప్రదించి ఉంటే కచ్చితంగా వారంతా తన ప్రతిపాదనను తిరస్కరించి ఉండేవారని చెప్పారు.
సుప్రియ బలమైన నేత
ఎన్సీపీ పగ్గాలు పవార్ కుమార్తె సుప్రియా సూలే చేపట్టడంపై ఒక పార్టీ నేత స్పంస్తూ.. ‘కొంతకాలంగా ఆమె బలమైన పార్లమెంటేరియన్గా ఎదిగారు. సమర్థత కలిగిన రాజకీయ వేత్త. అన్ని రాజకీయ పార్టీల్లో పరిచయలు ఉన్న వ్యక్తి’ అని అన్నారు. 2024 ఎన్నికలకు దేశం సిద్ధమవుతున్న ఈ తరుణం ఆమె పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడానికి తగినదని ఆయన చెప్పారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అధిక స్థానాలు లభిస్తే అజిత్పవార్ మహా వికాస్ అఘాడీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అవుతారని ఎన్సీపీ నేత ఒకరు అన్నారు. అయితే ఇందుకు శివసేన (ఉద్ధవ్ ఠాక్రె) ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉన్నది.