Karnataka |
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరికి కట్టబెట్టాలనే అంశంపై నాలుగు రోజుల పాటు తర్జన భర్జనలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయంపై సుదీర్ఘంగా సమాలోచనలు చేసి, చివరకు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని గురువారం సాయంత్రం బెంగళూరులో నిర్వహించే కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్లో ప్రకటించే అవకాశం ఉంది. సిద్ధరామయ్య, శివకుమార్ శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే సీఎల్పీ నాయకుడిగా సిద్ధరామయ్య పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక కేబినెట్పై కూడా అధిష్టానం తీవ్ర కసరత్తు చేసి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సుదీర్ఘంగా చర్చించి, పరిష్కరించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే డిప్యూటీ సీఎంగా శివకుమార్ ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరిస్తారా? లేదా..? అన్నదానిపై స్పష్టత లేదు. అయితే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే బుధవారం శివకుమార్తో చర్చలు జరిపిన సందర్భంగా రెండు ప్రతిపాదనలను ఆయన ముందు ఉంచినట్లు తెలిసింది.
దాంట్లో ఒకటి డిప్యూటీ సీఎంగా కొనసాగడం.. ఓ ఆరు మంత్రిత్వ శాఖలను సూచించి, అందులో మీకు ఇష్టమున్నది ఎంచుకోవాలని సూచించినట్లు తెలిసింది. డిప్యూటీ సీఎంగా కొనసాగుతూనే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం కూడా కల్పించినట్లు సమాచారం.
ఇక రెండో ఆప్షన్ విషయానికి వస్తే.. అధికారం పంచుకోవడం.. సిద్ధరామయ్య సీఎంగా రెండేండ్లు కొనసాగుతారు. మిగిలిన మూడేండ్లు సీఎం పదవి శివకుమార్కు కట్టబెట్టేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనకు సిద్దరామయ్య, శివకుమార్ విముఖత చూపినట్లు తెలుస్తోంది.