Saturday, April 1, 2023
More
    HomelatestSingareni | సింగరేణిలో మోగిన నగరా.. గత ఎన్నికల్లో ఏరులై పారిన మద్యం, అలవి కాని...

    Singareni | సింగరేణిలో మోగిన నగరా.. గత ఎన్నికల్లో ఏరులై పారిన మద్యం, అలవి కాని హామీలు

    • హోరా హోరి ప్రచారానికి సిద్ధమవుతున్న సంఘాలు
    • సింగరేణి చరిత్రలోనే రాజకీయ ప్రమేయంతో 2017 ఎన్నికలు

    విధాత బ్యూరో, కరీంనగర్: సింగరేణి (Singareni) బొగ్గు గనుల సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు నగరా మోగింది. కార్మిక సంఘాల ప్రతినిధులతో సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ రెండవ తేదీన షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ రీజినల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ప్రకటించారు. ఈ సమావేశానికి 33 కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానించగా 15 సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

    తెలంగాణలోని ఎనిమిది జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు గనుల సంస్థకు చెందిన 11 ఏరియాల్లో 34 భూగర్భ, 17 ఉపరితల గనుల్లో 50 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. 1990 నుండి సింగరేణిలో గుర్తింపు సంఘాల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగా, తొలి నాళ్లలో రెండేళ్ల కాల పరిమితి నిర్ణయించారు. ఈ విధానం 2000 సంవత్సరం వరకు కొనసాగింది. 2003లో గుర్తింపు సంఘాల పరిమితి నాలుగేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఆ నిర్ణయం 2017 వరకు అమల్లో ఉంది. 2017 ఎన్నికల అనంతరం గుర్తింపు సంఘ కాలపరిమితిని తిరిగి రెండేళ్లకు కుదించారు.

    సింగరేణి సంస్థలో సీపీఐ అనుబంధ ఏఐటియుసి మొదటి నుండి తన అధిపత్యం కొనసాగిస్తూ వచ్చింది. 1998,2001,2007 సంవత్సరాల్లో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో ఏఐటీయూసీ ఏకఛత్రాధిపత్యం సాధించింది. 2003 ఎన్నికల్లో ఐఎన్టీయూసీ, 2012,2017 ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించింది.

    గత ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబిజికెఎస్), హెచ్ ఎంఎస్, సిఐటియు, ఏఐఎఫ్ టియు ఒంటరిగా ఏఐటీయూసీ, ఐఎన్ టియుసి, టిఎన్టీయుసీ కలిసి సంయుక్తంగా ఎన్నికల బరిలోకి దిగాయి. 2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికలు130 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి బొగ్గు గనుల సంస్థపై తొలిసారి రాజకీయ ఆధిపత్యానికి తెరలేపాయి. పారిశ్రామిక ప్రగతికి, సామాజిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన బొగ్గు గని కార్మికుల పోరాట ఔన్నత్యానికి ఇవి మాయని మచ్చలా మిగిలిపోయాయి. ఆ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేపింది.

    శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులను ఎన్నికల ప్రచారంలో రంగంలోకి దింపింది. సాధారణ ఎన్నికల మాదిరిగా గని కార్మికులకు అలవికానీ హామీలు ఇచ్చింది. ప్రతి కార్మికునికి నివేషనస్థలం, గృహ నిర్మాణానికి 10 లక్షలు లాంటి హామీలు అధికార పార్టీ గుప్పించింది. బొగ్గు గనులతో పాటు, ముందుగానే బుక్ చేసిన కమ్యూనిటీ హాళ్లలో కార్మికులకు మందు, విందు ఏర్పాటు చేసింది.

    మొత్తం మీద ఆ ఎన్నికల్లో అధికార పార్టీ సింగరేణి కార్మిక సంఘ గుర్తింపు హోదా దక్కించుకుంది. గుర్తింపు సంఘం హోదా ధ్రువీకరణ పత్రం ఆలస్యంగా వచ్చిందన్న సాకుతో కొంతకాలం, కరోనాను కారణంగా చూపుతూ మరికొంతకాలం ఎన్నికలను అధికార పార్టీ వాయిదా వేసుకుంటూ వచ్చింది. కోల్ బెల్ట్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలపై సింగరేణి ఎన్నికల ప్రభావం ఉంటుందన్న కారణంగా గని కార్మికుల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపలేదు.

    ఈ నేపథ్యంలో సింగరేణిలోని అనేక కార్మిక సంఘాలు గుర్తింపు ఎన్నికల కోసం ఆందోళన బాట పట్టాయి. సింగరేణిలో కీలక సంఘమైన ఏఐటీయుసీ ఎన్నికల జాప్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం మూడు నెలల కాల వ్యవధిలో సింగరేణి గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర,రాష్ట్ర కార్మిక శాఖ అధికారులతో పాటు, సింగరేణి సిఎండికి ఆదేశాలు జారీ చేసింది.

    మొత్తం మీద సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలకు అడుగు ముందుకు పడింది. గుర్తింపు కార్మిక సంఘం రెండేళ్లు పదవిలో ఉండాలా, నాలుగేళ్ల పాటు కొనసాగాల అనే విషయంతో పాటు,
    డివిజన్ స్థాయిలో గుర్తింపుకు ఒక ఓటు, కార్పొరేట్ స్థాయిలో గుర్తింపుకు మరో ఓటు విధానం అమలు చేసే విషయమై సోమవారం నాటి సమావేశంలో చర్చ జరిగింది.

    మెజార్టీ కార్మిక సంఘాలు ఒకే ఓటు విధానాన్ని సమర్థించాయి. అయితే గుర్తింపు కాల వ్యవధి ఎన్నికల షెడ్యూల్ తోనే ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. మరే ఇతర కారణాలను సాకుగా చూపి ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తే తిరిగి కోర్టు మెట్లు ఎక్కుతామని స్పష్టం చేశాయి. దీంతో ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటివారంలో సింగరేణి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular