South Central Railway Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. వేసవిలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా తిరుపతి, కాకినాడ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాచిగూడ – తిరుపతి, తిరుపతి – కాచిగూడ, కాచిగూడ – కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ – కాచిగూడ మధ్య స్పెషల్ ట్రైన్స్ నుడపనున్నట్లు వెల్లడించింది.
కాచిగూడ-తిరుపతి (Train No. 07061) స్పెషల్ ట్రైన్ మే 25న రాత్రి 10.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం తిరుపతికి చేరుతుంది. తిరుపతి – కాచిగూడ (Train No. 07062) రైలు 26న మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు కాచిగూడ స్టేషన్కు చేరుతుంది. రెండు రైళ్లు షాద్ నగర్, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది.
కాచిగూడ – కాకినాడ (Train No. 07417) రైలు 27న రాత్రి 8.45 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు కాకినాడకు చేరుతుంది. మళ్లీ తిరుగు ప్రయాణంలో 28న (Train No. 07418) కాకినాడ నుంచి రాత్రి 9.55 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు కాచిగూడకు చేరుతుంది.
ఈ రైలు వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సమార్లకోట స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆయా రైళ్లను ప్రయాణికులు వినియోగించాలని రైల్వే కోరింది. ప్రత్యేక రైళ్లలో ఏసీ-2 టైర్, ఏసీ -3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని వివరించింది.