Adilabad | పురుగుల అన్నమే దిక్కయ్యింది.. వేధింపుల ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: గిరిజన సంక్షేమ హాస్టల్లో బాత్రూంలు కడిగిస్తూ వేధిస్తున్న ప్రిన్సిపాల్పై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్చేశారు. విద్యార్థినులంతా మూకుమ్మడిగా రోడ్డెక్కి బైఠాయించారు. ఆసిఫాబాద్, ఉట్నూర్లో ఆందోళనలకు దిగారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన సంక్షేమ హాస్టల్ ప్రిన్సిపాల్ అరాచకాలపై విద్యార్థినులు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌక్ లో […]

Adilabad |
- పురుగుల అన్నమే దిక్కయ్యింది..
- వేధింపుల ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: గిరిజన సంక్షేమ హాస్టల్లో బాత్రూంలు కడిగిస్తూ వేధిస్తున్న ప్రిన్సిపాల్పై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్చేశారు. విద్యార్థినులంతా మూకుమ్మడిగా రోడ్డెక్కి బైఠాయించారు. ఆసిఫాబాద్, ఉట్నూర్లో ఆందోళనలకు దిగారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన సంక్షేమ హాస్టల్ ప్రిన్సిపాల్ అరాచకాలపై విద్యార్థినులు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక అంబేద్కర్ చౌక్ లో రాస్తారోకో చేసి, నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా తరలివెళ్లి, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి తీరుతో అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కనీస వసతులు కల్పించడం లేదని, పురుగుల అన్నం పెడుతున్నారని ఆరోపించారు.
ఇదేమని అడిగితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బుక్స్ వచ్చినా ఇవ్వడంలేదని, పాఠశాల వాతావరణం అపరిశుభ్రంగా ఉండడంతో దోమలు, ఈగలతో అనారోగ్యం పాలవుతున్నామని పేర్కొన్నారు. హాస్టల్ వాచ్మన్ సైతం తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉట్నూర్లో..
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ గిరిజన సంక్షేమ ఇంటర్ మీడియట్ బాలికల గురుకుల కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి మాకు వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ కళాశాల బాత్రూంలకు తలుపులు లేవని, పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అమ్మాయిలు ఎలా స్నానం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.
వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి తమతో బాత్రూములు కడిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ పీఓకు ఏకరువు పెట్టుకున్నా స్పందన లేదన్నారు. వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఐటీడీఏ ఎదుట ధర్నాకు దిగుతామని విద్యార్థినులు హెచ్చరించారు
