Rajinikanth | సూపర్స్టార్ రజనీకాంత్ తమిళనాడు ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పార్టీని ప్రకటిస్తానని చెప్పిన కొద్ది రోజులకే.. ఎందుకో తెలియదుగానీ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు తలైవా. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితులతోనే రాజకీయాల్లోకి రావడం లేదని వెల్లడించారు. అయినా ఆయన అభిమానులు, మద్దతుదారులు మాత్రం ఇది సరైన నిర్ణయం కాదని భావిస్తూ వచ్చారు. తాజాగా రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉండడానికి గల ప్రధాన కారణాన్ని వెల్లడించారు. శనివారం చెన్నైలోని సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2010లో డాక్టర్ రవిచందర్ను కలిసిన రోజు నా జీవితంలో మరిచిపోలేనిదని, గతంలో నేను ఓ దవాఖానాలో తీసుకున్న చికిత్స అంత సంతృప్తికరంగా లేదన్నారు. అప్పటికే నా కిడ్నీ 60శాతం పాడైందని తేలిందని, ఆ సమయంలో రవిచందర్ అమెరికాలో ఉన్న రొచెస్టర్లోని మాయో క్లినిక్కు కిడ్నీ మార్పిడి కోసం వెళ్లమని సూచించినట్లుగా రజనీకాంత్ తెలిపారు. ఇక్కడ చాలా ఫార్మాలిటీలు ఉన్నాయని, దాంతో పాటు సెలబ్రిటీగా కూడా సమస్యలు ఉంటాయన్నారు. అందుకే ఆయన విదేశాలకు వెళ్లాలని ఒత్తిడి చేశారని గుర్తు చేసుకున్నారు తలైవా. డాక్టర్ రవిచందర్ తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించిన తర్వాతనే రాజకీయ సన్యానం తీసుకున్నట్లు స్పష్టనిచ్చారు.
2020 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రజనీకాంత్ రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు. దాంతో అభిమానులు, పలువురు ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఆ సమయంలో వేర్వేరు పార్టీలతో కలిసి పని చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సొంతంగానే పార్టీని పెట్టనున్నట్లు ప్రకటించారు. పార్టీ పేరు, జెండాపై కసరత్తు జరుగుతుండగా.. ఆ తర్వాత కొద్ది రోజుకే ఆరోగ్య పరిస్థితుల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. తలైవా ప్రకటనతో అభిమానులు, మద్దతుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. బీజేపీ పార్టీ రజనీకాంత్ తమకు మద్దతు ఇస్తారని భావించింది. ఆయన నిర్ణయంతో ఆ పార్టీ సైతం నిరాశకు గురైంది. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వచ్చినా.. ఇకపై తన నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.