- గవర్నర్ ను అవమానించారంటూ తప్పుడు వ్యాఖ్యలు
విధాత: గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ప్రభుత్వం సరిగా గౌరవించలేదంటూ అవాస్తవాలు మాట్లాడి ప్రజలను, సభను తప్పుదారి పట్టించారన్న ఆరోపణల మీద టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), నిమ్మల రామనాయుడు (Nimmala Ramanaidu) లను స్పీకర్ తమ్మినేని సీతారాం సభ నుంచి సస్పెండ్ చేశారు.
వాస్తవానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అవహేళన చేసేలా న్యాయమూర్తులు, ఎన్నికల కమిషనర్లు, రాష్ట్ర గవర్నర్లతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాగే గవర్నర్ అసెంబ్లీలోకి ప్రవేశించేటప్పుడు సభ్యులంతా సమయపాలన పాటించాలని, రాష్ట్రపతిని పార్లమెంట్లోకి తీసుకెళ్లిన విధంగానే గవర్నర్ను కూడా మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, ముఖ్యమంత్రి కలిసి స్వాగతం పలకాలన్నారు.
కానీ ఈ ప్రభుత్వం గవర్నర్ ముందుగా వచ్చి ముఖ్యమంత్రి కోసం వెయిట్ చేసేలా వ్యవహరించిందని విమర్శించారు. దీనిమీద ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కేశవ్ ఆరోపణలు అబద్ధాలు అంటూ బుధవారం ప్రభుత్వం వాదించింది. గవర్నర్ను తమ అవమానించలేదని, దగ్గరుండి సీఎం ఆహ్వానించారని, వీడియో ఆధారాలతో సహా నిరూపించింది. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణల్ని తిప్పి కొట్టారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitaram) అనుమతితో గవర్నర్కు సీఎం స్వాగతం పలికిన తీరుకు సంబంధించి వీడియోను ప్రదర్శించి రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవం ఏంటో కళ్లకు కట్టారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో బుగ్గన మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. టీడీపీవి అన్నీ తప్పుడు ఆరోపణలని ధ్వజమెత్తారు. గవర్నర్కు తాము ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదని బుగ్గన వివరించారు.
పయ్యావుల కేశవ్ అవాస్తవ ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన విజ్ఞప్తి చేశారు. ఎల్లో మీడియా కూడా బాధ్యతారహితంగా వార్తలు రాసిందని మండిపడ్డారు. టీడీపీ వ్యవహారశైలి సభా హక్కుల ఉల్లంఘనే అని ఆయన స్పష్టం చేశారు. అలాగే తప్పుడు ఆరోపణలు చేసినవారితో పాటు అవాస్తవాలు ప్రచురించిన వారిపైనా తీవ్ర చర్యలు తీసుకోవాలని స్సీకర్కు మంత్రి బుగ్గన విజ్ఞప్తి చేశారు.
మరో మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. ఆనాడు సీతారాంను స్పీకర్గా నియమించగా ఆయన్ను ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి కలిపి స్పీకర్ను ఆయన ఉచితాసనం వద్దకు తోడ్కొని వెళ్లాల్సిన సంప్రదాయాన్ని టీడీపీ తుంగలో తొక్కిందని. ఆ ప్రక్రియకు ఆనాడు చంద్రబాబు హాజరు కాలేదని గుర్తు చేశారు. ఏ సందర్భంగా మంత్రులను అడ్డుకుంటూ తమ పార్టీ సభ్యుడు కేశవ్ను వెనకేసుకు వచ్చిన రామానాయుడ్ని సైతం స్పీకర్ సస్పెండ్ చేశారు.