విధాత: ఉపాధ్యాయ వర్గాలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న బదిలీ, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో… రాష్ట్ర వ్యాప్తంగా 9,700 పదోన్నతులు పొందనుండగా, 30వేల మంది బదిలీలు కానున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదట 2015లో బదిలీలు కాగా, ఏడున్నరేండ్ల తర్వాత ఇప్పడు పదోన్నతులు, బదిలీలు కావటం ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత 317 జీవో ప్రకారం.. అప్పుడు 25వేల మంది బదిలీలు పొందారు. ఇప్పుడు వారికి బదిలీ అవకాశం లేదు.
ఈ మొత్తం వ్యవహారంలో.. స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్న వారికి ప్రధానోపాధ్యాయులుగా, ఎస్జీటీలుగా ఉన్నవారికి స్కూల్ అసిస్టెంట్లుగా, ప్రాథమిక పాఠశాల ప్రదానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందనున్నారు.
ఈ క్రమంలో 2,013 మంది ప్రధానోపాధ్యాయులు బదిలీ కానుండగా వారి స్థానంలో స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలుగా పదోన్నతులు పొందుతారు. పదోన్నతులతో 4,163 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ కానున్నాయి. బదిలీ అయిన హెచ్ ఎంలు 2,013 కలిపి మొత్తం ఖాళీలు ఏర్పడనున్నాయి.
కేటగిరి వారీగా సీనియారిటీ లిస్ట్ ప్రమోషన్స్ గ్రేడ్-2 హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారుల వద్ద అందుబాటులో ఉంటుంది. దీనికి అనుగుణంగా హై స్కూలు సిబ్బంది ఆ స్కూల్ హెచ్ఎంకే అవసరమైన డాక్యుమెంట్లు, హార్డ్ కాపీలను అందజేయాలి.
ప్రైమరీ, యూపీఎస్ పాఠశాలల సిబ్బంది తగు పత్రాలతో స్థానిక మండల విద్యాశాఖాధికారులకు సమర్పించాలి. లోకల్ బాడీ పాఠశాలల సిబ్బంది కూడా ఆయా ప్రధానోపాధ్యాయులకే తగు పత్రాలు జతచేసి సమర్పించాల్సి ఉంటుంది.