ప్రభుత్వ నిర్ణయం ఆలస్యం.. చౌటుప్పల్ KGBVలో ఒక్క విద్యార్థికే బోధన !
అధ్యాపకులు లేక ఇతర కళాశాలలకు వెళ్లిన విద్యార్థులు విధాత: ప్రభుత్వం ఆలస్యంగా తీసుకునే నిర్ణయం చాలామంది విద్యార్ధినుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. సరైన సమయంలో ప్రభుత్వం స్పందించి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తేది కాదంటున్నారు. అదేమంటే… యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఈ విద్యాసంవత్సరం ఇంటర్ ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రారంభించారు. దీంతో.. ఇక్కడే చదివిన బాలబాలికలు వంద మంది దాకా ఈ కోర్సుల్లో చేరారు. కానీ.. ప్రభుత్వం […]
- అధ్యాపకులు లేక ఇతర కళాశాలలకు వెళ్లిన విద్యార్థులు
విధాత: ప్రభుత్వం ఆలస్యంగా తీసుకునే నిర్ణయం చాలామంది విద్యార్ధినుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. సరైన సమయంలో ప్రభుత్వం స్పందించి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తేది కాదంటున్నారు. అదేమంటే…
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఈ విద్యాసంవత్సరం ఇంటర్ ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రారంభించారు. దీంతో.. ఇక్కడే చదివిన బాలబాలికలు వంద మంది దాకా ఈ కోర్సుల్లో చేరారు. కానీ.. ప్రభుత్వం సకాలంలో అధ్యాపకులను నియమించటంలో ఆలస్యం చేసింది. దీంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.
విద్యా సంవత్సరం మొదలై.. ముగింపునకు వచ్చినా అధ్యాపకులు రాలేదు..దీంతో కేజీబీవీలో చేరిన విద్యార్థులంతా వివిధ కళాశాలల్లో చేరిపోయారు. ఇన్నాళ్లకు ప్రభుత్వం మేల్కొని ఐదుగురు అధ్యాపకులను ప్రభుత్వం నియమించింది. కానీ ఆలస్యం..అమృతం.. విషం అంటారు కదా. ప్రభుత్వ అలసత్వానికి ఇది కరెక్టుగా సరిపోతుందేమో!
విద్యార్థులంతా ఇతర కాలేజీల్లో చేరిపోవటంతో కేజీబీవీ తరగతులు ఖాళీ అయిపోయాయి. బైపీసీలో పన్నెండు మంది, ఎంపీసీలో ఒక విద్యార్థిని మాత్రమే మిగిలారు. దీంతో చేసేది లేక ఎంపీసీలోని ఒక విద్యార్థికే పాఠాలు బోధిస్తున్నామంటున్నారు అధ్యాపకులు.
ఎక్కడైనా.. ఏదైనా సకాలంలో తీసుకొనే నిర్ణయాలతోనే మంచి ఫలితం ఉంటుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. అదను తప్పిన, ఆలస్యపు నిర్ణయాలు ఉంటే.. మన కేజీబీవీ కథే ఎక్కడైనా ఎదురుకాక తప్పదు మరి.