Telangana Congress |
- కర్ణాటక విజయం కలిసి వస్తుందన్న నేతలు
- మెదక్ ఉమ్మడి జిల్లాలో కలిసికట్టుగా కార్యాచరణ
- రెవెన్యూ డివిజన్ సాధన కోసం 17 న భారీ ర్యాలీ
- పదికిగాను ఐదు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ
- దుబ్బాకలో మళ్లీ కమలం కష్టమే.. ఇక్కడ త్రిముఖ పోటీ
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్కు సానుకూల పవనాలు
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో గెలుపు ధీమా
- ఖమ్మంలో పొంగులేటి కాంగ్రెస్లో చేరితే ఫలితాలు తారుమారు
- విధాత ప్రతినిధుల పరిశీలనలో వెల్లడి
విధాత, నెట్వర్క్: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ (Telangana Congress ) కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. హస్తం పార్టీ శ్రేణుల్లో గెలుపు ఉత్సాహం తొణికిసలాడుతున్నది. రాష్ట్రంలోని మెదక్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో విధాత బృందాలు సర్వే చేయగా, ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. అనేక చోట్ల బీఆర్ ఎస్కు ఎదురుగాలి వీస్తున్నది.
దుబ్బాకలో బీజేపీ మళ్లీ గెలువడం కష్టమేనని తేలిపోయింది. ఉమ్మడి ఖమ్మంలో పొంగులేటి ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఆయన చేయి అందిస్తే జిల్లా ఫలితాలు గణనీయంగా మారుతాయని గణాంకాలు చెప్తున్నాయి. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ హస్తం పార్టీ హవా కొనసాగే పరిస్థితులు త్వరలో రాబోతున్నాయని వెల్లడవుతున్నది.
మెదక్ ఉమ్మడి జిల్లాలో పాదయాత్రలతో ప్రజల వద్దకు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, కలిసికట్టుగా పాదయాత్రలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. రామాయంపేట డివిజన్ సాధన కోసం ఈ నెల 17 న డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతోపాటు నిరసన కార్యక్రమాలకు పార్టీ పిలుపు నిచ్చింది. అన్ని నియోజక వర్గాల్లో ఇప్పటికే పాదయాత్రలు చేశారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటం కాంగ్రెస్ కు కలిసి వీచ్చే అంశం. ఉమ్మడి జిల్లాల్లో 10 అసెంబ్లీ నియోజక వర్గాలకుగాను 7 చోట్ల కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్యనే పోటీ ఉన్నది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, మంత్రి హరీశ్నియోజకవర్గం సిద్దిపేట మినహా 6 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఉన్నది.
ఇక దుబ్బాకలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. పటాన్ చెరువు నియోజక వర్గంలో మాత్రం బీజేపీ, బీఆర్ ఎస్ మధ్య పోటీ నెలకొన్నది. మెదక్, నర్సాపూర్, అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజక వర్గాల్లో హస్తం, కారు మధ్యనే పోటీ ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే, ఆయా నియోజకవర్గాల్లో కారు పార్టీలో వర్గ పోరు స్పష్టంగా కనిపిస్తున్నది.
మెదక్ లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కి ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే తనయుడు రోహిత్ రావ్ ల రూపంలో ఆదిపత్యపోరు నడుస్తున్నది. తమకే టికెట్ దక్కుతుందని ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందోల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డికి మధ్యలో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో భేదాలున్నాయి. సంగారెడ్డి నియోజక వర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది.
ఉమ్మడి వరంగల్లో..
వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కు ఒక్కసారిగా సానుకూల రాజకీయ పరిస్థితి ఏర్పడింది. ఆశించిన స్థాయిలో నాయకత్వం అందుకోలేకపోయినప్పటికీ ప్రజల్లో తీవ్ర చర్చకు కర్ణాటక గెలుపు ఉపయోగపడింది. ఏడెనిమిది మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు, కేడర్లో మంచి కదలికకు దోహదం చేసింది.
వరంగల్ పశ్చిమ, తూర్పు, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామల్లో సానుకూల పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుంది. నాలుగు సెగ్మెంట్లలో నాయకత్వలేమి కారణంగా వెనుకంజలో ఉన్నారు. ఓటమి బీజేపీపై మోరల్గా ప్రభావం చూపింది. నాలుగు సెగ్మెంట్లలో వరంగల్ పశ్చిమ, తూర్పు, పరకాల, భూపాలపల్లిలో మాత్రం బీజేపీకి పోటీచేసే బలం ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, బోథ్, ముధోల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఉన్నాయి. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పీసీసీ కార్యదర్శి సుజాత ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ ప్రాంతంలో ఎన్నారై, బలమైన నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో పార్టీ బలం పుంజుకున్నదని హస్తం శ్రేణులు భావిస్తున్నాయి.
మంచిర్యాలతోపాటు బెల్లంపల్లి కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చెన్నూరులో మాజీ మంత్రి గడ్డం వినోద్ కి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు లేకపోలేదు. తూర్పు ప్రాంతంలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. కాగజ్నగర్ నియోజవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్కు బలమైన నాయకుడు లేడు. ఎన్నికల నాటికి బలమైన నాయకుడిని తెరపైకితెస్తే హస్తం గెలుపు ఖాయం అనుకోవచ్చు.
నిర్మల్ లో కొత్తగా పార్టీలోకి వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డికి పరిస్థితులు అనుకూలిస్తే గెలిచే అవకాశాలున్నాయి. ఖానాపూర్ లో రాథోడ్ చారులత అలాగే వొడుమా బొజ్జు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. బోథ్, ముథోల్ నియోజకవర్గాలలో కొత్తవారు ఎవరైనా వస్తే వారికి టికెట్ ఇస్తే వారి బలాబలాలను బట్టి గెలుపు ఓటములు ఆలోచించవచ్చు.
ఖమ్మంలో పొంగులేటితో మారనున్న లెక్కలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లే ఆ పార్టీ బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో కూడా చేరలేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో హస్తం పార్టీలో చేరేందుకు పొంగులేటి మొగ్గు చూపుతున్నారని తెలుస్తున్నది.
ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ ఖాతాలో ఖమ్మం పడినట్టే. ఖమ్మంలో ఫలితాలు తారుమారవవ్వడం ఖాయం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు గట్టి పట్టున్నది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత అయిన పొంగులేటి కాంగ్రెస్లో చేరితే, ఆయన చెప్పిన వారికి పార్టీ టికెట్ కేటాయిస్తే అందరినీ గెలుపించుకొనే సత్తా పొంగులేటికి ఉన్నదని స్థానిక క్యాడర్ భావిస్తున్నది.