విధాత, హైదరాబాద్ : గత రెండు మూడు రోజులుగా తెలంగాణను చలి వణికిస్తున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగత్రలు భారీగాపడిపోతున్నాయి. పగటిపూట సైతం చలిగాలులు వణికిస్తున్నాయి. మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల నుంచి చలిగాలలు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని పేర్కొందని. రాబోయే రెండు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగత్రలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రెండు రోజుల వరకు చలిగాలుల కొనసాగుతాయని, మళ్లీ వారం తర్వాత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో వైపు గ్రేటర్ హైదరాబాద్లో చలి తీవ్రత ఎక్కువైంది. ఈ క్రమంలో రాబోయే మూడు రోజుల వరకు గ్రేటర్కు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. మరో వైపు సోమవారం ఉదయం రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 4.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా నల్లవల్లిలో 5.7, న్యాల్కల్లో 5.9, సిద్ధిపేట జిల్లా అంగడి కిష్టాపూర్లో 7.5, మెదక్ జిల్లా శివ్వంపేట, నర్సాపూర్లలో 8, కుమ్రంభీం జిల్లా సిర్పూర్యూలో 4.8, వికారాబాద్ మర్కాపల్లిలో 5.0, రంగారెడి జిలాలోని తాళ్లపల్లి, మంగళ్లపల్లిలో 5.0, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో 5.4, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 5.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత్రలు నమోదయ్యాయి. చలితో పాటు ఉదయం ఎనిమిది గంటలైనా పలు ప్రాంతాల్లో మంచుదుప్పటి తొలగడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.