Telangana Weather |
రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో జనం అల్లాడుతున్నారు. ఉదయం నుంచి భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. అయితే, రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇది సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పొడివాతావరణం ఉంటుందని తెలిపింది.
శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నాగర్కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం ఉంటుందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది.
ఆదివారం నుంచి సోమవారం వరకు ఉదయం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జిల్లాలో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలా ఉండగా.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగానే నమోదయ్యాయి.
నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కరీంనగర్ జిల్లా తంగులలో 45.6, నల్గొండ జిల్లా దామరచర్లలో 45.5, కరీంనగర్ జిల్లా వీణవంక, సూర్యాపేట జిల్లా రాయినిగూడెంలో 45.4 డిగ్రీలు నమోదయ్యాయి.