The Kerala Story |
‘ది కేరళ స్టోరీ’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సుదీప్తో సేన్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా సినిమా సక్సెస్ మీట్ల కోసం పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వరుసబెట్టి ప్రయాణాలు చేస్తుండడంతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని సన్నిహితులు పేర్కొన్నారు. సుదీప్తో సేన్ ఆరోగ్యం బావుండాలని ఆయన అభిమానులు ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు. అదా శర్మ, యోగితా బిలానీ, సోనియా, సిద్ది ఇధ్నాని ప్రధాన పాత్రల్లో ‘ది కేరళ స్టోరీ’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది.
కేరళలోని 32 వేలమంది యువతులను మతం మార్పించి తీవ్రవాదులుగా ఎలా మార్చారో ఈ సినిమాలో చూపించారు దర్శకుడు సుదీప్తో సేన్. సినిమా విడుదల నుంచి పలు వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నించింది.
బ్యాన్ కుదరకపోవడంతో సినిమాను చూసిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. అయినా వెనక్కి తగ్గకుండా ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. సినిమా ప్రేక్షకాదరణతో భారీ వసూళ్లను రాబడుతున్నది. ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ బద్దలుకొట్టింది.