- రైతుల కోసం రాత్రి పూట కదిలిన మంత్రి
విధాత: ఎస్సారెస్పీ కాలువ నిర్మాణంలో గత పాలకులు చేసిన పాపమే ప్రస్తుతం రైతులకు శాపంగా మారిందని సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సాగు నీటి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం జలాలు సరిపడా తీసుకువస్తున్నా, కాలువల నిర్మాణంలో గత పాలకులు డబ్బే ప్రాతిపదికగా, నిర్లక్ష్యంతో చేసిన అడ్డగోలు తప్పిదాలతో అన్నీ ఉన్నా అంగట్లో శని అన్న మాదిరిగా రైతుల పరిస్తితి మారిందన్నారు.
ఎక్కడ తూములు, డ్రాప్ లు నిర్మించాలో అక్కడ నిర్మించక పోవడం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతుల ఇబ్బందిని తొలగించడం కోసం స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి, అధికారులు, రైతులతో కలిసి కెనాల్ వెంట పర్యటించి సాగు నీటికీ కష్టం అవుతున్న మోధినీపురం సబ్ మేజర్ వద్ద డ్రాప్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
ఇక్కడ డ్రాప్ నిర్మించడం ద్వారా చివ్వెంల మండలంలో వెయ్యి ఎకరాలకు సాగు నీరు పుష్కలంగా అందనుందన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి రాత్రి తమ కోసం వచ్చి డ్రాప్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం వెనువెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు ఇచ్చిన ఆదేశాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలువలపై ఉన్న తూముల నిర్వహణలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మంత్రి సీరియస్ అయ్యారు.
జాతర నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్కు నూతన రహదారి నిర్మాణం
కాశీంపేట నుండి బీబీగూడెం ఖమ్మం రహదారి కి అనుసందానం గా కెనాల్ రహదారి ఆధునీకరణ చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి దురాజ్ పల్లి పెద్ద గట్టు జాతరకు లక్షలాది మంది భక్తులు రానున్నారు.
ఈ నేపథ్యంలో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి పై రాకపోకలకు ఇబ్బంది కలగకుండా కాశీంపేట నుండి బీబీ గూడెం ఖమ్మం రహదారి వరకు ట్రాఫిక్ ను మళ్ళించడానికి వీలుగా ఎస్సారెస్పీ కాలువ రహదారిని ఆధునీకరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
వెంటనే పనులను మొదలు పెట్టాలని కోరిన మంత్రి రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.