Revanth Reddy | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు కొనసాగుతున్నాయి. నిరుద్యోగుల జీవితాలో చలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ శనివారం లీకేజీ వ్యవహారంపై మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఐటీశాఖ మంత్రి అయితే, రాష్ట్రంలోని ప్రతి కంప్యూటర్కు నేనే బాధ్యుడినా? అని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీలో పేపర్ల లీకేజీ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉన్నట్టు అనుమానిస్తున్నామని పేర్కొన్నారు.
లీకేజీ ఘటనకు కేవలం ఇద్దరే బాధ్యులని, ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పును మొత్తం వ్యవస్థకు ఆపాదించడం దారుణమన్నారు. లీకేజీ వెనుక ఎంతమంది ఉన్నా, ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చూస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. లీకేజీతో సంబంధం లేకపోతే సమీక్షలో ఎట్లా కూర్చున్నావ్? అని నిలదీశారు. సంబంధం లేకపోతే ఇద్దరే దోషులని ఎట్లా చెబుతున్నావ్? ప్రశ్నించారు. నువ్వేమైనా విచారణాధికారివా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు కస్టడీ కాకముందే ఇద్దరే దోషులని నీకేవరు చెప్పారు?.. సంబంధం లేకపోతే మీడియాతో నువ్వెట్ల మాట్లాడావ్? ట్విట్టర్ వేదికగా నిలదీశారు.
లీకేజీలో కేటీఆర్ పీఏ తిరుపతి పాత్ర ఉందని రేవంత్ ఆరోపణలు..
లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని శనివారం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి స్వస్థలం కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో గ్రూప్-1 రాసిన వంద మందికి 100కుపైగా మార్కులొచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. తెలంగాణలో అత్యంత బాధ్యతారాహిత్యమైన వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ రేవంత్ విమర్శించారు. టీఎస్పీఎస్సీ పరీక్షల్లో ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారాన్ని పరిశీలిస్తే.. మొదట హానీ ట్రాప్ అని, రెండోసారి హ్యాకింగ్ జరిగిందని, ఆ తర్వాత ఏకంగా లీకయిందని చెప్పారన్నారు. నిజాలు బయటకు రావడంతో పరీక్షలను రద్దు చేశారన్నారు.
లీకేజీ ఇష్యులో ఇద్దరిలో ఒకరు బీజేపీకి చెందిన వ్యక్తి అని బీఆర్ఎస్ చెబుతోందని, మరోవైపు ఐటీ మంత్రి ఏం చేస్తారో తెలుసా? అంటూ కేటీఆర్ తోండి వాదనకు దిగుతున్నారని విమర్శించారు. ఇంకోవైపేమో రెండో ముద్దాయి బీఆర్ఎస్ వాళ్లని బీజేపీ చెబుతోందని, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మొదటిసారి జరిగినట్లు మంత్రి మాట్లాడుతున్నారని, 2015లో సింగరేణి ఉద్యోగాల భర్తీ చేసేందుకు జరిగిన పరీక్షల్లో పేపర్ లీక్ అయిన వ్యవహారాన్ని గుర్తు చేశారు. కవితకు అందులో భాగస్వామ్యం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయని, 2016లో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకైందని, దాంతో మూడు సార్లు అభ్యర్థులు ఎంసెట్ పరీక్ష రాయాల్సి వచ్చిందని రేవంత్రెడ్డి గుర్తు చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో ఐటీ మంత్రిగా తనకేం సంబంధం అంటున్న కేటీఆర్ కు కొన్ని ప్రశ్నలు…
🔥సంబంధం లేక పోతే సమీక్షలో ఎట్లా కూర్చున్నావ్?
🔥సంబంధం లేకపోతే ఇద్దరే దోషులని ఎట్లా చెబుతున్నావ్?
🔥నువ్వేమైనా విచారణాధికారివా?
🔥పోలీసు కస్టడీ కాకముందే ఇద్దరే దోషులని నీకేవరు చెప్పారు?… https://t.co/RxWZKnI2Qc pic.twitter.com/Mxc9R2o3NZ— Revanth Reddy (@revanth_anumula) March 18, 2023