విపక్షం లేకుండా.. నాడు వైఎస్‌.. తర్వాత కేసీఆర్‌.. ఇప్పుడు బీజేపీ? నాడు వైస్ మొద‌లు పెట్ట‌గా.. విధాత‌: కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పైనే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కేంద్రీక‌రించాయి. ప్ర‌జ‌ల్లో ప‌ట్టున్న ఈ నేత‌లు త‌మ పార్టీలోకి వ‌స్తే త‌మ‌కు తిరుగుడంద‌న్న తీరుగా ఈ పార్టీల అగ్ర నాయ‌క‌త్వం ఆలోచ‌న చేస్తుండ‌డ‌మే ఇందుకు కార‌ణంగా క‌నిపిస్తున్న‌ది. మ‌రో ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీకి సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రుతాయి. ఈ ఎన్నిక‌ల్లో అధికారం చేజిక్కించుకోవాల‌ని రాష్ట్రంలో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు […]

  • విపక్షం లేకుండా.. నాడు వైఎస్‌.. తర్వాత కేసీఆర్‌.. ఇప్పుడు బీజేపీ?

నాడు వైస్ మొద‌లు పెట్ట‌గా..

విధాత‌: కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పైనే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కేంద్రీక‌రించాయి. ప్ర‌జ‌ల్లో ప‌ట్టున్న ఈ నేత‌లు త‌మ పార్టీలోకి వ‌స్తే త‌మ‌కు తిరుగుడంద‌న్న తీరుగా ఈ పార్టీల అగ్ర నాయ‌క‌త్వం ఆలోచ‌న చేస్తుండ‌డ‌మే ఇందుకు కార‌ణంగా క‌నిపిస్తున్న‌ది. మ‌రో ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీకి సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రుతాయి. ఈ ఎన్నిక‌ల్లో అధికారం చేజిక్కించుకోవాల‌ని రాష్ట్రంలో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి ప‌ని చేస్తున్నాయి. ఈ పార్టీల నాయ‌క‌త్వం సిద్దాంతాలు గాలికి వ‌దిలి ఎదుటి పార్టీలో బ‌లంగా ఉన్న నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకోవ‌డం ద్వ‌రా ల‌బ్ది పొందాల‌ని భావిస్తున్నాయి. ఇదే ప్ర‌ధాన సిద్దాంతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ముందుకు వ‌చ్చింది. 2018 ఎన్నిక‌ల త‌రువాత ఇది తీవ్ర‌త‌ర‌మైంది. 2023 అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీస్తుండ‌డంతో ఈ సిద్దాంతానికి ఎన‌లేని ప్ర‌ధాన్య‌త వ‌చ్చింది.

ఆజ్యం పోసింది వైఎస్‌

వైరి పార్టీ నేత‌ల‌కు గాలం వేసి ఆయా పార్టీల‌ను నామ రూపాల్లేకుండా చేయాల‌న్న ల‌క్ష్యంతో నాడు ఉమ్మ‌డి ఏపీకి ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప‌ని చేశారు. ముఖ్యంగా తెలంగాణ వాదం లేకుండా చేయాల‌న్న త‌లంపుతో నాడు టీఆర్ఎస్‌ను చీల్చే ప‌ని చేప‌ట్టాడు.. సోనియా గాంధీ నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయ‌డానికి ముందుకు వ‌స్తే అడ్డుకున్నాడు.. ఆనాడు మిత్రప‌క్షంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని బ‌ల‌హీన‌ ప‌ర్చే కుట్ర‌లో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మ‌ల్యేల‌ను కాంగ్రెస్‌లో చేర్చ‌కున్నాడు.. అలా నాడు వైరి పార్టీల నేత‌ల‌ను, గెలిచిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఏకంగా త‌మ పార్టీలో బ‌హాటంగా చేర్చుకునే విధానానికి నాడు వైఎస్ ఆజ్యం పోస్తే.. నేడు అది ఒక విధానంగా రూపొంత‌రం చెందింది.

రాష్ట్ర ఏర్పాటు త‌రువాత‌..

విభ‌జ‌న బిల్లును పార్ల‌మెంటు ఆమోదించిన త‌రువాత 2014లో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల త‌రువాత తెలంగాణ‌లో టీఆర్ఎస్‌, ఏపీలో టీడీపీలు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏమాత్రం ఇష్టం లేని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అసాంతం తెలంగాణ‌లో ఏర్పాటైన ప్ర‌భుత్వాన్ని కూల్చి వేసే కుట్ర‌ల‌కు పాల్ప‌డ్డారు.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన త‌రువాత ఇక ఏమి చేయ‌లేన‌ని భావించిన చంద్ర‌బాబు తెలంగాణ‌పై ఆశ‌లు వ‌దుల‌కున్నాడు…

బ‌ల‌ప‌డాలంటే..

2014 ఎన్నిక‌ల్లో మెజార్టీ సాధించి అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్ప‌టికీ తిరుగులేని అధికారం చెలాయించాలంటే. ప్ర‌త్య‌ర్థి పార్టీలను బ‌లహీన ప‌ర్చాల‌న్న సిద్దాంతంతో టీఆర్ఎస్ ముందుకు వెళ్లింది. రాజ‌కీయ పూన‌రేకీక‌ర‌ణ పేరుతో టీడీపీ, కాంగ్రెస్‌ల‌ను చీల్చి చెండాడింది. మొద‌ట సీమాంధ్ర నేత‌ల ఆధిప‌త్యం కింద ఉన్న టీడీపీపై కేంద్రీక‌రించింది. ఏకంగా ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు నేతృత్వంలో టీడీఎల్‌పీని పూర్తిగా టీఆర్ఎస్‌లో విలీనం చేసుకున్న‌ది. 2014 ఎన్నిక‌ల్లో 15 మంది స‌భ్యులున్న టీడీపీలో 10 మంది ఎమ్మ‌ల్యేలు నాడు టీఆర్ఎస్‌లో చేరారు. అలాగే ఒక ఇండిపెండెంట్, ఒక సీపీఐతో పాటు బీఎస్‌పీ, వైఎస్ఆర్‌సీపీ నుంచి గెలిచిన స‌భ్య‌లను ఆనాడు టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. అలా 2018 ఎన్నిక‌ల నాటికి టీఆర్ఎస్ రాష్ట్రంలో తిరుగులేని శ‌క్తిగా బ‌ల‌ప‌డింది. ఆ త‌రువాత రేవంత్‌రెడ్డి కొంత మంది నేత‌ల‌తో కాంగ్రెస్‌లో చేరారు.

విప‌క్షం లేకుండా చేయాల‌న్న త‌లంపుతో..

2018 ఎన్నిక‌ల త‌రువాత తిరిగి రెండ‌వ సారి అధికారం చేప‌ట్టిన టీఆర్ఎస్ రాష్ట్ర అభివృద్దికి విప‌క్షాలు ఆటంకాలు క‌లిగిస్తున్నాయ‌ని భావించారు. విప‌క్షం ఎంత బ‌ల‌హీన ప‌డితే తాను అంత బ‌ల‌ ప‌డ‌తాన‌ని భావించిన టీఆర్ఎస్ అధినేత ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీపై దృష్టి కేంద్రీ కరించి అక్క‌డి నుంచి వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించాడు.. 2018 ఎన్నిక‌ల్లో 88 సీట్లు సాధించి అతి పెద్ద‌గా పార్టీగా ఏర్ప‌డిన‌ప్ప‌టికీ టీఆర్ఎస్ శాంతించలేదు.. 19 మంది స‌భ్యుల బ‌లంతో ఉన్న కాంగ్రెస్‌పై క‌న్నేశాడు.. ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఉప ఎన్నిక‌తో హుజూర్‌న‌గ‌ర్ సిట్టింగ్ స్థానాన్ని మొద‌ట కాంగ్రెస్ కోల్పోయింది. 12 మంది కాంగ్రెస్ స‌భ్యుల‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకోవ‌డం ద్వారా సీఎల్‌పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసుకున్న‌ది. ఇలా మొద‌టి సారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. అలా నాడు వైఎస్ చేసిన చ‌ర్య‌కు ప్ర‌తి చ‌ర్య చేప‌ట్టి టీఆర్ఎస్ త‌న క్ష‌క్ష సాధించుకున్న‌ది.

మిగిలిన నేత‌ల‌పై గురిపెట్టిన బీజేపీ

కాంగ్రెస్ నుంచి గెలిచిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను టీఆర్ఎస్ విలీనం చేసుకుంటే.. తాను రాష్ట్రంలో బ‌ల‌ ప‌డ‌టానికి టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్‌లో మిగిలిన నేత‌ల‌పై బీజేపీ గురి పెట్టింది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలంటే ప్ర‌జాధ‌ర‌ణ ఉన్న కాంగ్రెస్ నేత‌ల‌తో పాటు టీఆర్ఎస్‌లో ఉన్న నేత‌ల‌ను తీసుకోవాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో బీజేపీ ప‌ని చేస్తున్న‌ది. అందుకే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్ షా మొద‌లు బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం అంతా ఇక్క‌డ కేంద్రీక‌రించింది.

టీఆర్ఎస్ కీల‌క నేత‌, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను చేర్చుకున్న త‌రువాత బీజేపీ త‌న దూకుడును పెంచింది. ఆత‌రువాత కాంగ్రెస్ ఎమ్మ‌ల్ల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించి బీజేపీలోకి తీసుకున్న‌ది. తాజాగా మాజీ ముఖ్య‌మంత్రి మ‌ర్రి చెన్నారెడ్డి కుమారుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డిని చేర్చుకుంటున్న‌ది. ఇలా కాంగ్రెస్‌లో బ‌ల‌మున్న ప్ర‌తి నేత‌ను బీజేపీ త‌మ పార్టీలోకి చేర్చుకోవ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.

ఇప్ప‌టికే ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో బ‌ల‌మున్న నేత డీకే ఆరుణ బీజేపీ గూటికి చేరి జాతీయ నాయ‌కురాలుగా ప‌ని చేస్తున్నారు. ఇటీవ‌లే రంగారెడ్డి జిల్లా నుంచి కొండా రంగారెడ్డి మ‌నుమ‌డు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే.. ఇలా టీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు రెండు కూడ కాంగ్రెస్‌లో బ‌ల‌మున్న నేత‌ల‌పై కేంద్రీక‌రించి వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి. ఇలా కాంగ్రెస్‌ను బ‌ల‌హీన ప‌ర్చ‌డం ద్వ‌రానే.. తాము పుంజుకోగ‌ల‌మ‌ని భావిస్తున్నాయి… కానీ త‌మ సిద్దాంతాల పునాదుల‌పై బ‌ల‌ ప‌డ‌తామ‌న్న న‌మ్మ‌కం వీరికి లేద‌ని స్ప‌ష్టం మ‌వుతున్న‌ది.

Updated On 20 Nov 2022 4:23 AM GMT
krs

krs

Next Story