- ఈసారి బీసీలకు అవకాశం!!
విధాత: తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త చైర్మన్ రాబోతున్నారు. ప్రస్తుత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది ఆగస్ట్ వరకూ ఉంది. అయితే ఆయన్ను ఈమధ్యనే ఉత్తరాంధ్ర జిల్లాలకు పార్టీ సమన్వయకర్తగా జగన్ నియమించారు. దీంతో ఆయన తరచూ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు ఇతరత్రా వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు.
గతంలో ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా విజయసాయిరెడ్డి ఉండేవారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో సుబ్బారెడ్డిని నియమించారు. దీంతో ఆయన తిరుపతి దేవస్థానం మీద ఎక్కువగా దృష్టి పెట్టలేక పోతున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడికి ఇంకో వ్యక్తిని చైర్మన్గా నియమిస్తారని అంటున్నారు.
అయితే ఇప్పటికే బీసీల జపం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ప్రతిష్టాత్మక మైన టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవి కూడా బీసీలకు ఇచ్చి ఆ వర్గాల మద్దతు పొందేందుకు జగన్ స్కెచ్ వేశారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీ కొత్త చైర్మన్గా బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి పేరును సీఎం పరిగణలోకి తీసుకున్నారు. ఈయన యాదవ సామాజిక వర్గ నేత. పల్నాడు జిల్లా గురజాలకు చెందిన కృష్ణమూర్తి వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు.
గతంలో చంద్రబాబు కూడా పుట్టా సుధాకర్ యాదవ్కు టీటీడీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సైతం టీటీడీ రేసులో ఉన్నారని అంటున్నారు. గతంలో భూమన వైఎస్ రాజశేఖర్రెడ్డి జమానాలో టీటీడీ చైర్మన్గా పని చేశారు.
అయితే ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీసీలను కాదని రెడ్డికి అవకాశం ఇస్తారా? సాధ్యమేనా అనే సందేహాలు ఉన్న నేపథ్యంలో జంగా కృష్ణమూర్తికే ఆ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.