భారీగా తరలివచ్చిన భక్తిజనం మల్లన్నకు మొక్కుల సమర్పణ భక్తులకు విస్తృత వసతి ఏర్పాట్లు ట్రస్టు బోర్డు కమిటీ లేకుండా జాతర విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: అంగరంగ వైభవంగా భక్తజన సందోహం మధ్య ఐలోని మల్లన్న జాతర భారీ స్థాయిలో ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి హాజరై మల్లన్నకు మొక్కులు సమర్పిస్తున్నారు. శుక్రవారం జాతర ప్రారంభంతోటే భక్తులు తరలివచ్చారు. సంక్రాంతి పర్వదినం నుంచి ప్రారంభమయ్యే ఈ జాతర ఉగాది పండుగ […]

- భారీగా తరలివచ్చిన భక్తిజనం
- మల్లన్నకు మొక్కుల సమర్పణ
- భక్తులకు విస్తృత వసతి ఏర్పాట్లు
- ట్రస్టు బోర్డు కమిటీ లేకుండా జాతర
విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: అంగరంగ వైభవంగా భక్తజన సందోహం మధ్య ఐలోని మల్లన్న జాతర భారీ స్థాయిలో ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి హాజరై మల్లన్నకు మొక్కులు సమర్పిస్తున్నారు. శుక్రవారం జాతర ప్రారంభంతోటే భక్తులు తరలివచ్చారు.
సంక్రాంతి పర్వదినం నుంచి ప్రారంభమయ్యే ఈ జాతర ఉగాది పండుగ వరకు కొనసాగుతోంది. అతి పురాతన జాతరగా పేరొందిన ఐలోని మల్లన్నను భక్తులు కొంగుబంగారంగా భావిస్తారు. కాకతీయుల కాలం నుంచి ఈ జాతర కొనసాగుతుందని చరిత్ర చెబుతోంది.
సంక్రాంతి నుంచి ఉగాది వరకు
సంక్రాంతి పర్వదినం ముందు రోజు భోగి సందర్భంగా శుక్రవారం ధ్వజారోహణంతో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐలోని మల్లన్న జాతర వేడుకల్లో భాగంగా భోగి నుంచి కనుమ వరకు భక్తులు లక్షలాది సంఖ్యలో పాల్గొంటారు. మకర సంక్రాంతి పండుగ రోజు రాత్రి ప్రభ బండ్లు తిరుగడం ఈ జాతరలో విశేషం.
సంక్రాంతి నుంచి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. భక్తులు ఒగ్గు కథలతో, డోలు చప్పుడు మధ్య శివసత్తుల పూనకాలు, దేవుడి పట్నాలు, బోనాలతో జాతర పరిసరాలు సందడిగా మారాయి. ఒక్క రోజులోనే జాతర పూర్తిగా ఆధ్యాత్మికతను సంతరించుకుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే జాతరలలో ఇది కూడా ఒక పెద్ద జాతరగా ప్రసిద్ధి గాంచింది. ఐలోని మల్లన్న జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఎడ్ల బండ్లల్లో, వాహనాల్లో, కాలినడకన కూడా భక్తులు ఐలోని క్షేత్రాన్ని చేరుకుని విడిది చేస్తున్నారు. బోనం, పట్నాలు, బండారి సమర్పించి మల్లన్నను కొలిచి తరిస్తున్నారు.
బండారి ఇక్కడి ప్రత్యేకత
మల్లికార్జున స్వామికి బండారి అంటే పసుపుని భక్తులు కానుకగా చెల్లిస్తారు. అదే పసుపును ప్రసాదంగా తీసుకుంటారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే స్వామివారి చేతిలో ఉన్న పసుపును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఉత్సవ సమయాల్లో కిలోల కొద్ది పసుపు ఉపయోగిస్తారు. మల్లన్న స్వామి భక్తుల ద్వారా జరిగే ముఖ్య పూజలలో బోనాలు సమర్పించడం, పట్నాలు వేయడం, ఒగ్గు పూజారీల ద్వారా చెల్లించడం జరుగుతుంది.
ఇక్కడికి వచ్చే భక్తులలో చాలామంది సంతానం గురించి టెంకాయ బంధనం కట్టి వారికి సంతానం కల్గిన తర్వాత టెంకాయ ముడుపు విప్పి, మల్లన్న మొక్కు చెల్లిస్తారు. గండాలు తీరితే గండదీపం పెడతాం, కోరికలు తీరితే కోడెలు కడతాం, పంటలు పండితే పట్నాలు వేస్తాం, ఇంటిల్లిపాది చల్లగా ఉంటే శేవలు తీస్తాం, తలనీలాలు సమర్పిస్తాం అని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
ఇక ఈ జాతరలో పెద్ద బోనం, చిన్న బోనం, నిలువ బొట్ల బోనం, చుక్కల బోనం అని భక్తులు తమ ఆనవాయితీ ప్రకారం బోనం చేసి స్వామివారికి నివేదిస్తారు. ఇక ఈ జాతరలో గొల్ల , కురుమలే ఒగ్గు పూజారులుగా తమ కథాగానం వినిపిస్తారు. పట్నాలు వేసి, ఒగ్గు పూజారిచే పూజలు చేపిస్తేనే అసలుసిసలైన బోనం సమర్పించినట్లుగా భక్తుల విశ్వాసం. అంతేకాదు శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, ఢమరుకం మోతలతో ఈ జాతర మార్మోగుతుంది.
భక్తులకు విస్తృత ఏర్పాట్లు
పాతకాలపు రథం దెబ్బతింటే పునరుద్దరించి పెద్దరథంగా మార్చి ఉత్సవాలలో ప్రదక్షినం చేయిస్తున్నారు. దీనితో పాటు కుక్కల కొట్లాట, చల్లకుండల నెత్తుట, తలబండారి పెట్టుకొని మొక్కులు చెల్లించుతారు. భక్తిభావంతో సాగే ఈ జాతర బహుళ ప్రచారంలో ఉంది.
జాతర సందర్భంగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం నీటి వసతి, విద్యుత్తు, రవాణా, ఇతర వసతి సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జాతర ప్రాంతంలో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసు అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా వరంగల్ నుంచి బస్సులు నడిపిస్తోంది. మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సి పి రంగనాథ్, ఇతర శాఖల అధికారులు ఆలయ ఈవో నాగేశ్వరరావు తదితరులతో ఇప్పటికే జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
వరంగల్ సమీపంలో…
వరంగల్ మహానగరానికి సుమారు 16 కిలో మీటర్ల దూరంలో ఉండే ఐనవోలు ఇటీవల అభివృద్ధికి నోచుకుంది. బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా యేడాది పాటు భక్తులు మల్లన్నను దర్శించుకునేందుకు వస్తూనే ఉంటారు. భక్తుల సౌకర్యార్థం అధునాతన గదులు, గెస్ట్ హౌజులు, నిర్మించారు. స్త్రీల స్నానాల గదులు, మరుగుదొడ్లు, నూతనంగా ధ్వజస్తంభం, నందికేశ్వర, విఘ్నేశ్వరులను ప్రతిష్టించారు. సాలహార నిర్మాణం జరిగింది. ఇక పిల్లలు ఆడుకునేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, తినుబండారాల దుకాణాలు ఏర్పాటయ్యాయి.
అయ్యన్న పేరుతో ఐనవోలు
తెలంగాణ జీవన విధానానికి, జానపదుల సంస్కృతికి ఐనవోలు ప్రతీకగా నిలుస్తుందని చెబుతున్నారు. మైలారు దేవుడు మల్లన్నగా కొలువుదీరిన ప్రాంతం ఐనవోలు. కాకతీయ పరిపాలన కాలంలో అయ్యన్న దేవుడనే మంత్రి ఉండేవాడు. ఆయన ఈ దేవాలయం నిర్మించినట్లుగా శాసనముల ద్వారా తెలియుచున్నది.
1100 యేళ్ల చరిత్ర కల్గిన పురాతన శైవక్షేత్రంను అయ్యన్న నిర్మించడం వలన ఈ గ్రామమునకు అయ్యన్నవోలు అనే పేరు వచ్చింది. ఇది కాలక్రమేనా ఐనవోలు, ఐలోనిగా రూపాంతరము చెందినట్లుగా తెలుస్తుంది. ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతున్న హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామంలో కొలువుదీరిన ఈ ఆలయం విశాల ప్రాంగణంతో , శిల్పకళా వైభవంతో , అష్టోత్తర స్తంభములతో, కాకతీయుల కళాతోరణములతో , సింహద్వారములతో చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. కోటి వరాలిచ్చే భక్తుల కొంగు బంగారం, ఆపదలను తీర్చే మల్లికార్జునుడుగా ప్రసిద్ధి పొందాడు.
ఐనవోలు మల్లన్న దేవాలయ చరిత్ర
పుట్టమన్నుతో పూజలు అందుకునే మల్లికార్జునస్వామి కొలువుదీరిన ప్రాంతమే ఐనవోలు. కోరమీసాల మల్లన్న ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలంతో ఖండేలు రాయుడిగా భక్తులకు దర్శనం ఇస్తాడు. కుడిపాదం కింద మల్లన్న చేతిలో చనిపోయిన మాణిమల్లసురుల శిరస్సులు కనిపిస్తాయి. మల్లన్నకు కుడివైపున గొల్ల కేతమ్మ, ఎడమవైపున బలిజ మేడలమ్మ అమ్మవార్లు కొలువుదీరి ఉంటారు.. గొల్ల కేతమ్మ మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన అమ్మవారిగా చెబుతారు. తన ఆడపడుచు గొల్లకేతమ్మను పెళ్లి చేసుకున్నదున మల్లికార్జునస్వామిని వారి ఇలవేల్పుగా గొల్లకురుమలు పసుపు బండారితో పూజిస్తారు.
ఇక రెండో భార్య బలిజమేడలమ్మ కర్ణాటక ప్రాంతవాసి. కర్ణాటక ప్రాంతంలో పుట్టిన ఖండేలు రాయుడు కర్ణాటక నుంచి మహారాష్ట్ర వరకు పరిపాలించాడు. కనుక మల్లన్న కర్ణాటక ప్రాంతానికి చెందిన బలిజ మేడలమ్మను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విగ్రహాల ఎదురుగా నిర్వికార నిరహంకార స్థితి లింగస్వరూపంలో మూలవిరాట్ మల్లికార్జునస్వామి ఉండటము. ఇట్టి లింగస్వరూపం అర్ధప్రానపట్టం కల్గి ఉండటం విశేషం. ఇలాంటి లింగాలు ఉండటం అరుదు. ఈ లింగం శ్వేత వర్ణం కలిగి ఉందని, ఎంతో ప్రాచీనమైనదని శైవాగమ పండితుల అభిప్రాయం.
రాజులంతా మల్లన్న భక్తులు
రాష్ట్ర కూటులు, కళ్యాని చాళుక్యులు, కాకతీయులు, ఏ రాజుల చరిత్రను పరిశీలించినా వారంతా ఐనవోలు మల్లికార్జునస్వామి భక్తులేనని చారిత్రక ఆనవాళ్లు, శిలా శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. శివభక్తులకు మహా పుణ్యక్షేత్రం ఐనవోలు. కాకతీయుల కాలం నుంచి ఆలయ నిర్వహణ స్థానిక మార్నేని వంశస్తులు, కురుమలు, శైవారాధకులు ( తమ్మలు) సంయుక్తంగా నిర్వహించేవారు.
జానపదుల జాతరగా పేరుగాంచిన ఐనవోలు కీర్తి మరింత విస్తరించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో అప్పటి వరకు హక్కుదారుగా కొనసాగిన మార్నేని వంశీయులు 1968 లో స్వచ్ఛందంగా ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి మల్లికార్జున స్వామి ఘనవైభవం నలుదిశలా విస్తరించింది.
ట్రస్టు బోర్డు కమిటీ లేకుండా జాతర
ఈసారి ట్రస్టు బోర్డు కమిటీ లేకుండానే జాతర నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 10వ తేదీన 15 మంది సభ్యులతో జీవో 11 ద్వారా నూతన ట్రస్ట్ బోర్డు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ప్రమాణస్వీకారం చేసే సమయానికి నూతన కమిటీ ఏర్పాటు జీవోను హైకోర్టు సస్పెన్షన్ చేసినట్లు అధికారుల మౌఖిక ఆదేశంతో ప్రమాణస్వీకారం నిలిచిపోయింది. హనుమకొండకు చెందిన పైల శ్రీనివాసరావు నిబంధనలకు విరుద్ధంగా ట్రస్ట్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసినట్లు హైకోర్టును ఆశ్రయించడంతో జీవోను సస్పెన్షన్ చేసినట్లు సమాచారం.
