విధాత, తిరుమల: వైకుంఠ ఏకాదశికి టికెట్లు ఉన్నభక్తులనే తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. జనవరి 2న వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని.. 11వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని ధర్మారెడ్డి వెల్లడించారు
రోజుకు 25వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లను ఆన్లైన్లో జారీ చేయనున్నట్లు చెప్పారు. అలాగే తిరుపతిలోని 9 ప్రాంతాల్లో రోజుకు 50 వేల చొప్పున సర్వదర్శన టోకెన్లు కూడా జారీ చేస్తామన్నారు.
మొత్తంగా 7.5 లక్షల మందికి సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నామని ఈవో తెలిపారు. ఈ సదావకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకొని దైవ ఆశీస్సులు పొందాలని కోరారు.