Vande Bharat Sleeper |కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్లను పట్టాలకెక్కించింది. హైటెక్ హంగులతో రూపుదిద్దుకున్న రైళ్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, పూర్తిగా దేశీ పరిజ్ఞానంతో దక్షిణ మధ్య రైల్వే ఈ రైళ్లకు రూపకల్పన చేసింది.
ప్రస్తుతం ఉన్న రైళ్లతో పోలిస్తే ఎనర్జీ వినియోగం ఈ కొత్త ట్రైన్లో 30 శాతం తక్కువగా ఉండడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఇంటీరియర్ డిజైన్ చేశారు. సీటు 180 డిగ్రీ రొటేట్ అవుతుందని, అలాగే బుక్ రీడింగ్ లైట్స్, ప్రతి కోచ్లో జీపీఎస్ ఫెసిలిటీ, విమానంలో మాదిరి డైనింగ్ టేబుల్ ఫెసిలిటీ ఉంటుంది.
దేశవ్యాప్తంగా 15 మార్గాల్లో వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అయితే, ప్రస్తుతం నడుస్తున్న ఈ రైళ్లలో కేవలం సీటింగ్ మాత్రమే ఉన్నది. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టబోతున్నది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. స్లీపర్ కోచ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా మారనున్నది.
ప్రస్తుత రైలుకు భిన్నంగా వందే భారత్ స్లీపర్..
పూరీ -హౌరా మధ్య ఇటీవల వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రైలులో ప్రయాణించిన సమయంలో వందే భారత్ రైలుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై కీలక విషయాలను వెల్లడించారు. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. ఈ రైలు డిజైన్ మార్చి నాటికి సిద్ధమవుతుందని తెలిపారు.
వందే భారత్ స్లీపర్ గరిష్ఠ వేగం 240 కిలోమీటర్లు ఉంటుందని, అలాగే ప్రస్తుత వందే భారత్ ఎక్స్ప్రెస్కు పూర్తి భిన్నంగా స్లీపర్ రైలు ఉంటుందన్నారు. భారత్లో కొత్త సాంకేతికతతో కొత్త కోచ్లు తయారు చేస్తున్నామని, ఇంటీరియర్ పూర్తిగా మారిపోతుందన్నారు.
రాబోయే రోజుల్లో పడుకొని ప్రయాణించే కొత్త స్లీపర్ వందే భారత్ రైలు రాబోతుందని, సౌకర్యాలు రాజధాని ఎక్స్ప్రెస్ కంటే మెరుగ్గా ఉంటుంది. స్లీపర్ రైలు సగటు వేగం రాజధాని ఎక్స్ప్రెస్ కంటే 40శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతో ప్రయాణికుల సమయం ఆదాకానున్నది.
పట్టాలెక్కేది ఎప్పుడంటే..?
ప్రస్తుతం వందే భారత్ రైలు విజయవంతంగా నడుస్తున్నాయి. పలు మార్గాల్లో ఈ రైళ్లకు మంచి ఆదరణ ఉన్నది. ఈ క్రమంలో రైల్వేశాఖ చెన్నైలోని ఐసీఎఫ్ వద్ద వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రూపకల్పనపై కసరత్తులు చేస్తున్నది. మార్చి 2024 నాటికి డిజైన్ ఖరారవుతుందని భావిస్తున్నారు.
వందే భారత్ స్లీపర్ ట్రయల్స్ ఏడాది పాటు కొనసాగనున్నది. ఈ స్లీపర్ రైలు బోగీ లేఅవుట్ డిజైన్, ఇంటీరియర్లో 40 నుండి 50 మార్పులుండే అవకాశాలున్నాయి. ఇక వందే భారత్ స్లీపర్ గరిష్టంగా 240 కిలో మీటర్ల వేగంతో నడువనున్నాయి.
ప్రస్తుతం 100కుపైగా కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుండగా.. దశలవారీగా వేగాన్ని పెంచనున్నారు. ఇందు కోసం రైల్వేశాఖ ట్రాక్ను అప్డేట్ చేస్తున్నది. ఇదే సమయంలో అన్ని రైల్లకు అడ్వాన్స్డో సిగ్నల్ సిస్టమ్ తయారు చేయడంతో పాటు యాంటీ కొలిజన్ టెక్నాలజీని తీసుకువచ్చే పనులు కొనసాగుతున్నాయి.