వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదనడానికి నిదర్శనమా.. వెంకటగిరి నూతన ఇన్చార్జిగా రామ్కుమార్ విధాత: అధికార పార్టీలో ఉంటూ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ విధానాలనూ తూర్పారబడుతూ నోటి దురద చూపిస్తూ వస్తున్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి పార్టీ షాక్ ఇచ్చింది. రానున్న ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇచ్చే అవకాశాలు లేవని చెప్పేందుకు సూచనగా వెంకటగిరి ఇన్చార్జి పదవి నుంచి ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ […]
- వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదనడానికి నిదర్శనమా..
- వెంకటగిరి నూతన ఇన్చార్జిగా రామ్కుమార్
విధాత: అధికార పార్టీలో ఉంటూ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ విధానాలనూ తూర్పారబడుతూ నోటి దురద చూపిస్తూ వస్తున్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి పార్టీ షాక్ ఇచ్చింది.
రానున్న ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇచ్చే అవకాశాలు లేవని చెప్పేందుకు సూచనగా వెంకటగిరి ఇన్చార్జి పదవి నుంచి ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ ను వెంకటగిరి ఇన్చార్జిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక రామనారాయణ రెడ్డి పాత్ర వైస్సార్సీపీలో ముగిసినట్లయింది.
గతంలో కాంగ్రెస్ హయాంలో వైఎస్సార్ కేబినెట్లోనూ ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లోనూ మంత్రిగా పని చేసిన ఆనం 2019లో వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. తన సీనిఆయార్టీని గుర్తించి మంత్రి పదవి ఇస్తారేమోనని భావించినా జగన్ అంత ప్రయార్టీ ఇవ్వలేదు.
అప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న ఆనం అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా తాము ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని.. తమ పదవులు దండగా అన్నట్లుగా మాట్లాడుతున్నారు.
ఈరోజు కూడా సభలో మాట్లాడుతూ ఒకవేళ ముందస్తు ఎన్నికలొస్తే ఇంటికెళ్లడం ఖాయమని ఆయన తీవ్ర హెచ్చరిక చేయడం గమనార్హం. సచివాలయాల నిర్మాణాలు ముందుకు సాగకపోవడంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్లే సచివాలయాలు నిర్మాణాలకు నోచుకోలేదని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
సైదాపురం మండలంలో సచివాలయాలు ఎందుకు నిర్మాణాలకు నోచుకోలేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీకి ప్రజలు అధికారం ఇచ్చి నాలుగేళ్లు పూర్తి అవుతోందన్నారు. ఇంకా సచివాలయాల నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. ఇందుకు కారణం… సాంకేతికపరమైన లోటుపాట్లా? కట్టడానికి ముందుకు రావడం లేదా? లేదంటే కట్టడానికి ముందుకొచ్చినా బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం అవుతుందనా? ఎందుకు జరుగుతున్నదో తెలియదన్నారు.
ముందస్తు ఎన్నికలొస్తే ఏడాది కూడా వుండదు… ఇంకా ముందే ఇంటికి పోతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ అధికారం నుంచి దిగిపోవడం ఖాయమని ఆయన బహిరంగంగానే తేల్చి చెప్పారు. ఇక ఆయన్ను భరించే ఓపికలేని జగన్ ఆయనకు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని అన్యాపదేశంగా చెప్పేశారు.
వెంకటగిరి రామ్ కుమార్ రెడ్డిని ఇన్చార్జిగా చేసేస్తూ ఇక ఆనం రామనారాయణ రెడ్డిని పక్కన బెట్టేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రామనారాయణ రెడ్డి ఇప్పటికే టిడిపి నాయకులతో టచ్ లో ఉన్నారని ఈ విషయం తెలిసే జగన్ ఇలా వేటు వేశారని అంటున్నారు.