ప్రధాని పర్యటన ముందు పదవీగండమెందుకు? ఏపీ క్యాడర్లో ఉన్న అధికారుల్లో మొదలైన గుబులు విధాత: తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఇన్నాళ్లూ ఒక వెలుగు వెలిగిన సోమేశ్కుమార్ తెలంగాణ క్యాడర్ రద్దు ఇప్పడు అనేక చర్చలకు దారితీస్తోంది. ఈ నెల 19న ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు తెలిసింది. వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిపై హైకోర్టు తీర్పు రావడం, కేంద్రం ప్రభుత్వం డిఓపీటీ […]
- ప్రధాని పర్యటన ముందు పదవీగండమెందుకు?
- ఏపీ క్యాడర్లో ఉన్న అధికారుల్లో మొదలైన గుబులు
విధాత: తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఇన్నాళ్లూ ఒక వెలుగు వెలిగిన సోమేశ్కుమార్ తెలంగాణ క్యాడర్ రద్దు ఇప్పడు అనేక చర్చలకు దారితీస్తోంది. ఈ నెల 19న ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు తెలిసింది. వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిపై హైకోర్టు తీర్పు రావడం, కేంద్రం ప్రభుత్వం డిఓపీటీ కూడా ఈనెల 12లోగా ఏపీలో రిపోర్టు చేయాలని స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది.
సీఎస్ సోమేశ్కుమార్ స్థానిక క్యాడర్పై స్పష్టమైన తీర్పు వెలువడటం తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు ఊహించని పరిణామమే అని చెప్పాలి. ఇన్నాళ్లూ కేసీఆర్కు అనుంగు అధికారిగా, రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతూ వచ్చిన సోమేశ్కుమార్ నిజంగా ఏపీకి వెళ్లాల్సి వస్తే… ఆయన వెళతారా? లేక కేసీఆర్ స్థాపించిన బీఆర్ ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది. అలాంటి పాత్ర పోషించాలంటే, సోమేశ్కుమార్ ముందు తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే సోమేశ్కుమార్ పదవి కూడా ఈ ఏడాది డిసెంబర్తో పూర్తవుతుంది. కేవలం 11 నెలల పదవి కోసం ఆయన ఏపీకి వెళ్లి జాయిన్ కావడానికి విముఖంగా ఉన్నారని తెలుస్తోంది.
12లోగా ఏపీకి రిపోర్టు చేయండి.. CS సోమేశ్ను ఆదేశించిన కేంద్రం
ఈ సాయంత్రం కేసీఆర్ తో భేటి అయిన సందర్భంలో కేసీఆర్ కూడా ఆలోచించుకోమని సోమేశ్కే నిర్ణయాన్ని వదిలిపెట్టారని చెబుతున్నారు. సోమేశ్కుమార్ ముందు కేసీఆర్ రెండు ఆప్షన్లు పెట్టినట్లు చెబుతున్నారు.. ఒకటి…. పదవికి రాజీనామా (స్వచ్ఛంద పదవీ విరమణ) చేయడం, భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ ఎస్) నిర్మాణంలో పాలుపంచుకోవడం, రెండు పదవిలో కొనసాగుతూనే, ధరణి వంటి కీలకమైన వ్యవహారాల్లో సీఎం సలహాదారుగా ఉండటం.
కానీ ఈ రెండు ఆప్షన్లలో ఏది ఎంచుకుంటారనే విషయంపై సోమేశ్కుమార్ స్పష్టత ఇవ్వనట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజులు ఆలోచించుకుని నిర్ణయం చెబుతానని ఆయన కేసీఆర్తో చెప్పినట్లు కూడా బయట వార్తలు వస్తున్నాయి. ఈనెల 12వ తేదీలోగా ఏపీకి రిపోర్టు చేయండని సీఎస్ సోమేశ్ను కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఏ నిర్ణయమైనా ఈ రెండు రోజుల్లోనే తీసుకోవాల్సి ఉంది.
ఏపీ కేడర్ అధికారుల్లో గుబులు
సోమేశ్కుమార్పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ క్యాడర్లో తెలంగాణలో కొనసాగుతున్న అధికారుల్లోనూ గుబులు మొదలైంది. డిజిపి అంజన్కుమార్, ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి, ప్రశాంతి, రోనాల్డ్ రాస్, వాణీ ప్రసాద్ తదితరుల్లో తమ పరిస్థితి ఏంటనే ఆందోళన మొదలైందని చెప్పాలి.
సోమేశ్కుమార్కు వర్తించిన రూల్సే పై అధికారులకు కూడా వర్తింపజేస్తే, వారు కూడా తక్షణం తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ వారెవరికీ ఏపికి వెళ్లడం ఇష్టం లేదు. ఈ పరిస్థితుల్లో వారి భవిష్యత్ ఏంటనేది కూడా చర్చనీయాంశమైంది.
సోమేశ్కుమార్ తీర్పును అడ్డుపెట్టుకుని పై అధికారులపై ఎవరైనా కోర్టుకు వెళితే పరిస్థితి ఏంటనేది కూడా వారి ఆందోళనను మరింత పెంచుతోంది. ఏపీ పరిస్థితులు, అక్కడి రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న అధికారులు, అదే తప్పనిసరి అయితే, కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.