Bhatti Vikramarka
- మరమగ్గాలకు ఉచిత కరెంటు ఇస్తాం
- పేదల భూములు గుంజుకుంటే ఖబర్దార్
- గీత కార్మికుల ప్రమాద బీమా ప్రీమియం చెల్లిస్తాం
- బునాది గాని కాల్వ పూర్తి చేయకపోవడం ప్రభుత్వ అసమర్థత
- ఇందిరమ్మ రాజ్యం తోనే రాష్ట్ర భవితవ్యం
విధాత, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చినట్టుగానే, నేతన్నల మరమగ్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత కరెంటు ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రకటించారు. శుక్రవారం పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బీబీనగర్ మండలం గొల్లగూడెం, మగ్ధుంపల్లి, చిన్న పలుగుతండా, పెద్ద పలుగు తండా, గుర్రాల దండి, భట్టుగూడెం పెద్ద రావులపల్లి గ్రామాల్లో కొనసాగింది.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పాదయాత్రకు ప్రజలు అడుగడుగున స్వాగతం పలుకగా, మహిళలు మంగళ హారతులతో స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన కార్నర్ సభల్లో ప్రజలను ఉద్దేశించి భట్టి విక్రమార్క ప్రసంగించారు. ప్రజల జీవితాలకు కూడు, గూడు, గుడ్డ అవసరమని, అందుకే కాంగ్రెస్ పార్టీ కార్మిక, కర్షక, నేతన్నలను ప్రోత్సహించేందుకు ఎప్పుడు ముందుంటందన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాలోనే నూలు వడికే చెరకు ఉందని, కాంగ్రెస్ పార్టీకి నేతన్నలకు విడదీయని అనుబంధానికి ఇదే సంకేతం అన్నారు.
గత ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన భూములను బలవంతంగా గుంజుకుంటే ఖబర్దార్ అని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధికారంలోకి రావడానికి దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఇచ్చిన హామీని విస్మరించి గత ప్రభుత్వాలు దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి పేదల ఉసురు తప్పనిసరిగా తగులుతుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న మిగులు భూములు అన్నింటిని పేదలకు పంచుతామని, అసైన్డ్ కమిటీలను తిరిగి పునరుద్ధరణ చేస్తామని ప్రకటించారు. గీత కార్మికులు తాటి చెట్లు ప్రతిరోజు ఎక్కి, దిగడం వారికి పునర్జన్మనేని, ఇంతటి ప్రమాదకరమైన వృత్తిని కొనసాగిస్తున్న గీత కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గీత కార్మికులకు ప్రమాద బీమా ప్రీమియం డబ్బులని ప్రభుత్వం పూర్తిగా చెల్లించి తాటి చెట్టు పైనుంచి పడిన కార్మికులకు ప్రమాద బీమా వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గొల్ల,కురుమలకు పంపిణీ చేస్తున్న గొర్ల పథకం అవినీతి మయంగా మారిందని లబ్ధిదారులు తనతో చెబుతున్నట్లు వెల్లడించారు. వేల మంది లబ్ధిదారులు డీడీలు కట్టి ఏడాది దాటినప్పటికీ ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయడం లేదని వివరించారు. గొర్రెలకు బీమా ప్రీమియం ముందే తీసుకుంటూ పరిహారం మాత్రం చెల్లించడం లేదన్నారు.
కొలువులు రాకుండా నిరుద్యోగులను మోసం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నదని నిప్పులు చెరిగారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో బునాది గాని కాలువ పనులు మొదలుపెట్టినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం పూర్తి చేయకపోవడం అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. బునాదిగాని కాల్వ విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ ఆగమైపోయిందన్నారు. నాలుగు కోట్ల మందికి చెందాల్సిన సంపద కేసీఆర్ కుటుంబంలో నలుగురు మాత్రమే దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
2023 -24 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడానికి విద్యార్థిలోకం నడుం బిగించిందని వివరించారు. తెలంగాణ ప్రజల సంపద నాలుగు కోట్ల మందికి చెందకుండా దోపిడీ చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం త్వరలోనే ఉందని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యం తోనే రాష్ట్ర భవితవ్యం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.
ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకొని టీఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడించారు. కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం లో ఉచితంగా నిర్బంధ విద్యను అందిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల వరకు మెరుగైన వైద్యం అందించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి , రాజు ఎమ్మెల్యే కుడుదుల నగేష్, ఆలేరు, భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పోత్నాక్ ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్, బీర్ల అయిలయ్య యాదవ్, బంద్రు శోభారాణి, కల్లూరు రామచంద్రారెడ్డి, అయోధ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.