కెజియఫ్ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా లేనట్టేనా?
విధాత: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. ఆ తర్వాత ఆయన రెండేళ్లకు పైగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి పరిమితమైపోయాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించి దేశ విదేశాలలో ఎన్టీఆర్ సత్తాను చాటింది. విదేశాలలో సైతం ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఆ ఆనందం ఎన్టీఆర్ అభిమానులకు పెద్దగా సంతోషంగా అనిపించడం లేదు.
దానికి కారణం ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాల విషయంలో క్లారిటీ లేకుండా ఉండడమే. ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చి ఐదేళ్లయింది. ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత వెంటనే కొరటాల శివతో 30వ సినిమా ప్రారంభిస్తాడని భావిస్తే ఆ సినిమా ఇప్పటివరకు సెట్స్ పైకే వెళ్లలేదు. ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళుతుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు దీని తరువాత ఎన్టీఆర్ కెజియఫ్ ఫ్రాంచైజీ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఓ చిత్రం చేస్తాడని వార్తలు వచ్చాయి.
ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్కు వీరాభిమాని. దాంతో ఆయన కచ్చితంగా ఎన్టీఆర్తో సినిమా చేస్తానని ప్రకటించాడు. కాగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్తో ‘సలార్’ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ప్రశాంత నీల్ ఎన్టీఆర్తో చేస్తాడని అందరూ భావించారు. కానీ మధ్యలోనే దిల్ రాజు వచ్చి చేరాడు.
‘సలార్’ పూర్తయిన వెంటనే ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘రావణం’ అనే చిత్రం ఉంటుందని, ఇది పాన్ ఇండియా మూవీగా రూపొందుతోందని క్లారిటీ ఇచ్చారు. ఆ వెంటనే కెజియఫ్ 3 ఉంటుందని హోంబలే ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ చిత్రంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
‘సలార్’తో పాటు ‘రావణం’, కెజియఫ్ 3 పూర్తి చేయాలంటే కనీసం మూడు నుంచి నాలుగు ఏళ్ళు పడుతుంది. అంటే అప్పటిదాకా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ల చిత్రం ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాని చేస్తూనే ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రశాంత్ నీల్ చిత్రాన్ని ప్రారంభించాలని భావించాడు.
సలార్ మూవీ విడుదలైన వెంటనే తన చిత్రం ఉండేలా చూసుకోవాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి సందిగ్ధంలో పడింది. మరి మొత్తానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ల చిత్రం ఉంటుందా? ఉంటే ఎప్పుడు మొదలవుతుంది? వంటి విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.