30-35 ఏండ్ల మధ్య వయసున్న యువతులే టార్గెట్ మూడు హత్యలు.. సీరియల్ కిల్లర్ పనేనా? బెంగళూరులో టెన్షన్ టెన్షన్ Serial killings । ఆ ముగ్గురు మృతులు 30-35 ఏండ్ల మధ్య వయసు ఉన్న మహిళలే! వారి శవాలు దొరికినది రైల్వే స్టేషన్ల వద్దే! రెండు శవాలు ప్లాస్టిక్ డ్రమ్లో దొరికితే.. మరొకటి ప్లాస్టిక్ బ్యాగ్లో లభ్యమైంది! డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ మూడు హత్యలకు మధ్య లింకు ఏమైనా ఉన్నదా? ఇప్పడు బెంగళూరు […]
- 30-35 ఏండ్ల మధ్య వయసున్న యువతులే టార్గెట్
- మూడు హత్యలు.. సీరియల్ కిల్లర్ పనేనా?
- బెంగళూరులో టెన్షన్ టెన్షన్
Serial killings । ఆ ముగ్గురు మృతులు 30-35 ఏండ్ల మధ్య వయసు ఉన్న మహిళలే! వారి శవాలు దొరికినది రైల్వే స్టేషన్ల వద్దే! రెండు శవాలు ప్లాస్టిక్ డ్రమ్లో దొరికితే.. మరొకటి ప్లాస్టిక్ బ్యాగ్లో లభ్యమైంది! డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ మూడు హత్యలకు మధ్య లింకు ఏమైనా ఉన్నదా? ఇప్పడు బెంగళూరు పోలీసులను కలవరపెడుతున్న అంశమిది!
విధాత : బెంగళూరులో తాజాగా వెలుగు చూసిన యువతి మృతదేహం అనేక సందేహాలకు తావిస్తున్నది. ఇదే పద్ధతిలో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దొరికిన మూడో మృతదేహం కావడం, అందులో రెండు మృతదేహాలు ప్లాస్టిక్ డ్రమ్లలో ఉంచి ప్లాట్ఫాంపై పడేయడం, మృతులంతా 30-35 ఏళ్ల మధ్య వయస్కులే కావడంతో ఇదేమైనా సీరియల్ కిల్లర్ పనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ప్లాస్టిక్ డ్రమ్లో డెడ్బాడీ బెంగళూరులోని బ్యప్పనహళ్లిలోని శ్రీ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ (Sri M Visvesvaraya Terminal (SMVT)) వద్ద ఒక ప్లాస్టిక్ డ్రమ్లో ఒక యువతి మృతదేహాన్ని మార్చి 14న గుర్తించారు. రైల్వే పోలీసులు డ్రమ్ను తెరిచి చూడగా.. కుళ్లిపోయిన స్థితిలో ఒక యువతి మృతదేహం కనిపించింది.
ఆమె వయసు 30 ఏళ్లకు అటూఇటూగా ఉండొచ్చని అంచనా వేశారు. ఇదే తరహాలో మృతదేహం నగరంలోని రైల్వే స్టేషన్లలో లభించడం గత ఏడాది డిసెంబర్ తర్వాత మూడవ ఉదంతం. ఈ యువతి ఎవరో తెలుసుకునేందుకు, రైల్వే స్టేషన్లో డ్రమ్ను వదిలి పోయిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మూడవ మృతదేహం కూడా గతంలో లభించిన తీరులోనే ఉండటంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది జనవరి 4వ తేదీన యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. ఒక ప్లాస్టిక్ డ్రమ్ నుంచి దుర్వాసన వస్తుంటే గమనించిన పారిశుధ్య సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ డ్రమ్లో సదరు మహిళ దుస్తులు కూడా ఉన్నాయి. దుప్పట్టాతో ఆమె మెడ నులిమి చంపి ఉంటారని భావిస్తున్నారు.
అంతకు ముందు గత ఏడాది డిసెంబర్లో బంగర్పేట శ్రీ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్లో ఒక మెము రైలు కంపార్ట్మెంట్లో ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో కుక్కి ఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ మహిళ వయసు కూడా 30కి అటూఇటూ ఉంటుందని అంచనా వేశారు.
అయితే.. అప్పటికి ఆ శవం కుళ్లిన దశలో లేదు.
సిటీలో కలవరం నెలల వ్యవధిలో మూడు మృతదేహాలు లభించడం, అన్నీ ఒకే పద్ధతిలో హత్యకు గురైనట్టు ఆనవాళ్లు ఉండటంతో నగర ప్రజల్లో ఆందోళనకర పరిస్థతి ఏర్పడింది. అయితే.. ఈ మూడు హత్యలకు మధ్య లింకు ఉన్నదని ఇంకా నిర్థారించలేమని పోలీసులు అంటున్నారు. అయినప్పటికీ.. మూడు కేసుల మధ్య ఏమన్నా సంబంధం ఉన్నదా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.