- డాక్టర్ ప్రీతి సంఘటనపై విచారణ జరపాలి
- సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశం
- వీసీకి లేఖ రాసిన గవర్నర్ తమిళసై
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేఎంసీ పీజీ మెడికో డాక్టర్ ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని మొదట తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డాక్టర్ ప్రీతి సంఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కేఎంసీలో ర్యాగింగ్ జరిగిందా? గతంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అనే వివరాలు నివేదికలో పొందుపరచాలని సూచించారు.
ఈ మేరకు మంగళవారం గవర్నర్ తమిళసై కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డికి లేఖ రాశారు.
మహిళా మెడికోల ఏర్పాట్లపై ఆరా
మెడికల్ కాలేజీలలో సీసీ కెమెరాలు ఉన్నాయా? యాంటి రాగింగ్ పై ఎలాంటి మెకానిజం అమలులో ఉందని ఆమె ప్రశ్నించారు. మహిళా మెడికోలకు కాలేజీలలో ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయో? తెలియజేయాలని గవర్నర్ పేర్కొన్నారు.
కౌన్సిలింగ్ సెల్ ఏర్పాటు చేయాలి
విద్యార్థినుల కోసం సైకియాట్రిస్టు, కౌన్సిలింగ్ సెల్, ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని గవర్నర్ సూచించారు. ఇలాంటి సంఘటనలలో ఎలాంటి ఉదాసీనత లేకుండా తక్షణం స్పందించి కాలేజీలలో కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, వారికి సంబందించి సరైన విశ్రాంతి లాంటి అంశాలపై సరైన శ్రద్ధ పెట్టాలి గవర్నర్ ఆ లేఖలో పేర్కొన్నారు.