- వేధింపులకు పాల్పడిన ఎస్సై పై చర్య తీసుకోవాలని బంధువుల ఆందోళన
- న్యాయం చేయాలంటున్న ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి కుటుంబం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దొంగతనం నెపం మీద వేధింపులకు పాల్పడిన గీసుకొండ ఎస్సై పై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంజీఎం హాస్పిటల్ మార్చురీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. వంశీని వేధించిన ఎస్ఐ శ్వేత (SI Swetha) పై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు తక్షణం స్పందించాలని కోరారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు తమకు న్యాయం చేయాలని విన్నవించారు.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటకు చెందిన పోలం వంశి అనే యువకుడు పోలీసు వేధింపులు తట్టుకోలేక స్టేషన్లో పురుగుల మందు తాగి సోమవారం ఆత్మహత్య యత్నం చేసుకోగా మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న వంశీ కుటుంబానికి న్యాయం చేయాలని ఎంజీఎం మార్చరీ వద్ద బంధువుల ఆందోళన చేపట్టారు. ఈ కారణంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
గీసుకొండ మండలం శాయంపేటలో జరిగిన ఒక దొంగతనం కేసులో విచారణ పేరుతో వంశీని పోలీసులు తరచూ వేధించడంతో అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపణలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. తమ ఇంటి పెద్ద దిక్కున కోల్పోయినందున ఆదుకోవాలని వంశీ తల్లి, చెల్లె విన్నవించారు.