YS Sharmila | ఎన్నికలొచ్చాయి.. కుంభకర్ణుడు లేచాడు సీఎం కేసీఆర్‌పై షర్మిల ఫైర్‌ గాంధీ కుటుంబంలో వైఎస్సార్‌పై అపార ప్రేమ నిర్ధారణ చేసుకున్నాకే భేటీ వెళ్లాను పార్టీ విలీనం అంశంపై త్వరలోనే వెల్లడిస్తా విధాత: తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రావడంతో కుంభకర్ణుడు నిద్ర లేచినట్లుగా సంక్షేమ పథకాల పేరుతో హడావుడి చేస్తున్నారని వైఎస్సార్‌టీపీ పార్టీ అధినేత వైఎస్‌. షర్మిల విమర్శించారు. శనివారం తన తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలో నివాళులర్పించిన షర్మిల, […]

YS Sharmila |

  • ఎన్నికలొచ్చాయి.. కుంభకర్ణుడు లేచాడు
  • సీఎం కేసీఆర్‌పై షర్మిల ఫైర్‌
  • గాంధీ కుటుంబంలో వైఎస్సార్‌పై అపార ప్రేమ
  • నిర్ధారణ చేసుకున్నాకే భేటీ వెళ్లాను
  • పార్టీ విలీనం అంశంపై త్వరలోనే వెల్లడిస్తా

విధాత: తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రావడంతో కుంభకర్ణుడు నిద్ర లేచినట్లుగా సంక్షేమ పథకాల పేరుతో హడావుడి చేస్తున్నారని వైఎస్సార్‌టీపీ పార్టీ అధినేత వైఎస్‌. షర్మిల విమర్శించారు. శనివారం తన తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలో నివాళులర్పించిన షర్మిల, అనంతరం హైద్రాబాద్‌కు చేరుకుని పంజాగుట్ట వద్ద వైఎస్స్‌ర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నియంత, అవినీతి పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ పాలన అంతానికే సోనియాగాంధీ, రాహల్‌గాంధీలతో కలిసి చర్చించినట్లుగా తెలిపారు. చర్చలు సానుకూలంగా జరిగాయని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు. తెలంగాణలో 3,800కిలోమీటర్ల పాదయాత్ర ఒక యజ్ఞంలా పాదయాత్ర సాగిందని, ప్రతి చోట ప్రజలు చెప్పిన సమస్యలు సామాన్యమైనవి కావన్నారు.

కేసీఆర్ గత ఎన్నికలలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. తెలంగాణ ఖజానాను, రాష్ట్ర సంపదను పందికొక్కులా దోచుకుతిన్నాడన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నట్లయ్యిందన్నారు. ప్రభుత్వ భూములను ఇప్పటికే 30 వేల ఎకరాలు అమ్మేశాడని, రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిన కేసీఆర్ పాలన అంతమైతేనే తెలంగాణ సమాజం బాగుపడుతుందన్నారు.

వైఎస్‌పై గాంధీ కుటుంబంలో ఆపార ప్రేమ

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో భేటీని తప్పుబడుతూ కొంత మంది మా పార్టీ లీడర్లు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాళ్ళ అందరికీ మీ చెల్లిగా,అక్కగా ఒక మాట చెప్తున్నానని, రాజకీయం అంటే వండినట్లు ,తిన్నట్లు కాదన్నారు. రాజకీయాలు చేయడం అంటే చిత్తశుద్ది ఉండాలని, ముందు చూపు ఉండాలి, ఓపిక ఉండాలన్నారు. ఈ రెండేళ్లలో నాతో కలిసిన ప్రతి నాయకుడికి , కార్యకర్తకు మాట ఇస్తున్నానని, నేను నిలబడుతా, మిమ్మల్ని నిలబెడుతానని, నా పై నిందలు వేసే వాళ్లు కూడా బాగుండాలని కోరుకుంటున్నానన్నారు.

వైఎస్సార్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది సోనియా గాంధీ అని మా వాళ్ళే నన్ను ప్రశ్నించారని, వైఎస్సార్ విగ్రహం సాక్షిగా ఒక విషయం చెప్పాల్సివుందని, నేను ఈ విషయం చెప్పక పోతే వైఎస్సార్ అభిమానులకు అసలు విషయం తెలియదన్నారు. ఇదే అంశం సోనియా దగ్గర ప్రస్తావనకు తెచ్చానని, రాజీవ్ గాంధీ చనిపోయాక కూడా సీబీఐ ఛార్జ్ షీట్ లో చేర్చారని ఆమె చెప్పారని, ఆ బాధ ఎంటో మాకు తెలుసని సోనియాగాంధీ అన్నారని షర్మిల వెల్లడించారు.

కాగా.. మాకు తెలిసి తెలిసి అలాంటి అవమానం మేము ఎలా చేస్తామన్నారని, వైఎస్సార్ పై మాకు అపార మైన గౌరవం ఉందన్నారని, వైఎస్సార్ కుటుంబానికి ద్రోహం ఎలా చేస్తామని, వైఎస్సార్ లేని లోటు మాకు ఈ రోజు కూడా తెలుస్తుందని సోనియాగాంధీ తనతో చెప్పడం జరిగిందన్నారు. ఆమెతో భేటీలోనాకు అర్థమైంది ఏమిటి అంటే..వాళ్ళు తెలియక చేసిన పొరపాటేనని, కాంగ్రెస్ తెలిసి చేసిన తప్పు కాదన్నారు.

వైఎస్సార్ ను సోనియా , రాహుల్ అపారంగా గౌరవం ఇస్తున్నారని నేను నిర్ధారణకు వచ్చిన తర్వాతే సోనియాతో ,రాహుల్ తో చర్చలు జరిపానన్నారు. వైఎస్ పట్ల సోనియాగాంధీ, రాహుల్‌లు రియలైజేషన్ కి వచ్చారని, అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. పాలేరులో పోటీ అంశం, కాంగ్రెస్‌లో పార్టీ విలీనం అంశాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. అంతకుముందు తల్లి విజయలక్ష్మితో కలిసి షర్మిల ఇడుపుల పాయలో వైఎస్సార్ 14వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ధ ప్రత్యేక ప్రార్థనలు చేసి నివాళులర్పించారు.

షర్మిల వెళ్లాక సీఎం జగన్ ఇడుపులపాయకు చేరుకుని తండ్రి సమాధి వద్ధ నివాళులర్పించారు. కాగా ఇడుపుల పాయలో మాట్లాడిన షర్మిల వైఎస్సార్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారన్నారు. వైఎస్సార్ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, ఉచిత విద్యుత్తు, రుణమాఫీతో రుణ విముక్తులను చేశారన్నారు. 46లక్షల పక్కా ఇండ్లను కట్టించాడన్నారు. వైఎస్సార్ లేని లోటు తీరనిదని, వైఎస్సార్ లేడన్న మాట జీర్ణించుకోలేక 700 వందల మంది చనిపోయారని, వారి ప్రాణ త్యాగం వైఎస్సార్ బిడ్డ ఎన్నటికీ మరిచి పోదన్నారు.

Updated On 2 Sep 2023 1:45 PM GMT
somu

somu

Next Story