విధాత, హైదరాబాద్: పారిశుధ్య కార్మికుల వచ్చేదే అరకొర జీతం.. పైగా అది కూడా సమయానికి చేతికి అందదు.. మూడు మాసాల పెండింగ్.. తమకు జీతం పెంచాలని, దాన్ని సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేస్తున్నా స్పందన కరువు..
దీంతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని కుటుంబాన్ని నెట్టుకురాలేక అనేక అవస్థలు.. ఇదీ రాష్ట్రంలోని పారిశుధ్య కార్మికుల దుస్థితి. ఈ నేపథ్యంలో జీతాల కోసం నగరంలోని జీహెచ్ఎంసీ కార్మికులు ఆందోళనలు చేపడుతున్నారు.
ప్రగతి భవన్ ముట్టడికి GHMC కార్మికులు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు భారీ ర్యాలీకి కార్మికులు ప్లాన్ చేశారు. జీహెచ్ఎంసీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని.. జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రగతి భవన్ వరకూ కార్మికులు ర్యాలీ చేయనున్నారు. ప్రగతి భవన్ ముందు చెత్తవేసి నిరసన తెలుపుతామని కార్మికులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.