తెలంగాణ బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు

- కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మని జనం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి
విధాత: తెలంగాణ బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణపై బీజేపీ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఆ వర్గాల ప్రజలు బీజేపీని గెలిపించబోతున్నారని, నిశ్శబ్ధ విప్లవం రాబోతుందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీవి ఆచరణ సాధ్యం కాని హామీలన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలకే దిక్కు లేదని, ఇక్కడ ఆరు గ్యారంటీలకు దిక్కు ఉంటుందా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే తెలంగాణ ప్రజల చేతిలోకి చిప్ప వస్తుందన్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రజల నెత్తిమీద భస్మాసుర హస్తమని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా అస్థిర, అవినీతి మయమేనన్న సంగతి మరువరాదన్నారు. జీహెచ్ఎంసీ, ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాని కాంగ్రెస్కు బీజేపీని విమర్శించే హక్కు లేదన్నారు.
అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్ అవినీతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అవినీతికి మూల్యం తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ గెలుపు సాధనకు రానున్న వారం రోజుల్లో ప్రధాని మోదీ ఆరు సభల్లో పాల్గొంటారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతుబంధును కొనసాగిస్తామని, వరి పంటకు రూ.3,100 కనీస మద్దతు ధర ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అన్ని రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
ఫీజులపై నియంత్రణ తీసుకొస్తాంమని, విద్య, వైద్య రంగాన్ని తీర్చి దిద్దుతామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మేధావులు, కవులు, కళాకారులు అలోచన చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లను, అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు. దేశవాళీ ఆవులను రైతులకు అందిస్తామన్నారు. నాలుగు శాతం మతపరమైన రిజర్వేషన్లను ఎత్తేసి హైకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పారు.
