బలిదానాలు.. సకల జనుల పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదని, సీఎం కేసీఆర్ కుటుంబం, ఆ పార్టీ నేతల కలలు మాత్రమే నెరవేరాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు

  • కేసీఆర్ కుటుంబం కలలే సాకారం
  • వనపర్తి కాంగ్రెస్ ప్రచార సభలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి

విధాత, మహబూబ్‌నగర్ బ్యూరో : బలిదానాలు.. సకల జనుల పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజల, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదని, సీఎం కేసీఆర్ కుటుంబం, ఆ పార్టీ నేతల కలలు మాత్రమే నెరవేరాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆరెస్ పదేళ్ల పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్, కవిత కలలు నెరవేరాయి తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదన్నారు.

తెలంగాణ వస్తే రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉండవు అనుకున్నామని, సింగరేణి, విద్యుత్ కార్మికులు తమ బతుకులు బాగుపడతాయని కలలు కన్నామన్నారు. దళితులు, గిరిజనులు ఆత్మగౌరవంతో బతకాలనుకునుకుంటే వారి బతుకులు మరింత ఆగమయ్యాయన్నారు. మూడేళ్లలో 83వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్న నరహంతక ప్రభుత్వం బీఆరెస్ ప్రభుత్వమని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చాక అధికారిక లెక్కల ప్రకారం 91వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

2018 నుంచి 2021 వరకు 83వేల మందికి రైతుబీమా ఇచ్చామని నిరంజన్ రెడ్డి ప్రకటించడం రైతు మరణాలకు నిదర్శనమన్నారు. దీనికి బాధ్యులు ఈ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్...కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలను ఆపేందుకే కాంగ్రెస్ రైతు భరోసా పథకం ప్రకటించిందన్నారు. కేసీఆర్ అవినీతి వల్లే మేడిగడ్డ కుంగిందని, కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షకోట్లు దోచుకుండని, పదేళ్లు కేసీఆర్ దండుపాళ్యం ముఠా రాష్ట్రాన్ని దోచుకుందన్నారు.

కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అంటుండని, చింతమడకకు రోడ్డు వేసింది...సిద్దిపేటలో కేసీఆర్ చదువుకున్న డిగ్రీ కాలేజి కట్టింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర అడుక్కునేదని ఎద్దేవా చేశారు. నాడు ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ఏముండే... ఇప్పుడు వందలాది ఎకరాలు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ వేల ఎకరాల్లో ఫామ్ హౌసులు కట్టుకుంటే వారి శిష్యుడు నిరంజన్ రెడ్డి వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుండన్నారు.

అభివృద్ధిలో ముందుండాల్సిన వనపర్తికి నిరంజన్ రెడ్డి చెడ్డపేరు తెచ్చారన్నారు. వనపర్తి ఎమ్మెల్యే అంటే అత్యంత అవినీతిపరుడనే ముద్ర పడిందని, నిరంజన్ రెడ్డి గుడి మాన్యాలనూ మింగిండు అని రాష్ట్రమంతా కోడై కూస్తోందన్నారు. పంచె కట్టుకుని నిరంజన్ రెడ్డి తనకు తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అనుకుంటుండని, లాల్చీ వేసుకున్న ప్రతీ వాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు.. పంచె కట్టిన ప్రతీవాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదని నిరంజన్‌రెడ్డిని విమర్శించారు.

ఇక అభివృద్ధి కోసం ఎవరి దగ్గరో చేతులు చాచడం కాదని, మన అభివృద్ధి.. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉందన్నారు. వనపర్తికి పరిశ్రమలు రావాలంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాలని, పాలమూరు జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా తీసుకునేలా మీరు నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. పదేళ్లు కేసీఆర్ కు అవకాశం ఇచ్చారని, ఒక్క అవకాశం కాంగ్రెస్‌కు ఇవ్వండన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందన్నారు.

చిన్నారెడ్డి గారు నాకు పెద్దన్నలాంటి వారని, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని, తెలంగాణలో వనపర్తికి ఒక ప్రాముఖ్యత ఉందన్నారు. 1952లో సురవరం ప్రతాప్ రెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారని, 1959లో ఆనాటి ప్రధాని నెహ్రూ ఈ ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజి ప్రారంభించారని, నేను చదువుకుంది వనపర్తిలోనే.. నాకు ఈ ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం ద్వారా రానున్న కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాంతా అభివృద్ధికి ప్రజలు బాటలు వేయాలన్నారు.

Updated On
Somu

Somu

Next Story