విధాత ప్రత్యేకం: ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణపై ఈరోజు ఒక నాయకుడు ఫేస్బుక్ లైవ్ పెట్టి మరీ విరుచుకు పడ్డారు. గతంలో టీడీపీలో మేధావి వర్గంలో భాగంగా ఉన్న ఆయన పేరు పంజుగుల శ్రీశైల్రెడ్డి. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్లో నాయకుడిగా ఉన్నరు. తెలంగాణపై రాధాకృష్ణకు కడుపు నిండా ద్వేషం ఉన్నదని, తెలంగాణలో పుట్టిన వాడినే అని చెబుతున్నా.. ఆయనలో తెలంగాణ ఆత్మ లేదని విమర్శించారు.
రాధాకృష్ణ తెలంగాణలో పుట్టడం ఘోర రోడ్డు ప్రమాదంతో సమానమని తీర్మానించారు. తెలంగాణ రాదనే విశ్వాసంతో ఉండేవాడని, తెలంగాణ వచ్చిందని కొందరు ఆయన వద్దకు వెళ్లి చెప్పినప్పుడు ఆయన ముఖం కందగడ్డలా మారిపోయిందని కూడా అన్నారు.
మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత దాదాపు ఏడెనిమిది సంవత్సరాలకు.. అంటే 2010 వరకు తెలంగాణకంటూ ఒక సొంత మీడియా లేదు. తెలంగాణ వాదాన్ని వినిపించేందుకే ఉన్న పత్రికలు, టీవీలు అప్పటికి రాలేదు. కానీ.. తెలంగాణ బుద్ధిజీవుల వాదనలన్నింటికీ ఆ రోజు వేదికగా నిలిచిన పత్రికలు వార్త, ఆంధ్రజ్యోతి మాత్రమేనని ఒక జర్నలిస్టు గుర్తు చేశారు.
ఆంధ్రప్రభ తెలంగాణ వార్తలనే నిషేధించింది. ఈనాడు పత్రికలో తెలంగాణ వార్తలు ప్రముఖంగా ఎప్పుడూ కనిపించేవి కాదు. వ్యాసాలు అసలే ఉండేవి కాదు. ఆ సమయంలో ఆంధ్రజ్యోతి పత్రికకు ఎడిటర్గా పని చేసిన సీనియర్ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి గానీ, ప్రస్తుత ఎడిటర్ కే శ్రీనివాస్ గానీ, ఆంధ్రజ్యోతిలో పని చేసిన అల్లం నారాయణ, కట్టా శేఖర్రెడ్డి.. అనేక మంది తెలంగాణ పాత్రికేయులు తమ అభిప్రాయాలను ప్రపంచానికి చాటింది తొలుత వార్త, తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికల ద్వారానే.
తెలంగాణ వాదమే కాదు.. తెలంగాణ వ్యతిరేక వాదాలు కూడా అక్షర యుద్ధం చేసుకున్నది ఆంధ్రజ్యోతి పత్రిక కేంద్రంగానే. వేమూరి రాధాకృష్ణకు సొంత ఎజెండాలు ఏమున్నా.. తెలంగాణ వాదం పత్రికలో కనిపించేందుకు ఆయన అవకాశం ఇచ్చినది మాత్రం వాస్తవం. ఇతర విమర్శలు ఎలా ఉన్నా.. ఇది మాత్రం అంగీకరించాల్సిన వాస్తవం.