అవినీతిలో నెంబర్ వన్ గా ఎదిగిన సిఎం కేసీఆర్ను రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే జైలుకు పంపిస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు

- అవినీతిలో ఆయన నెంబర్ ఒన్
- మిషన్ అంటే కేసీఆర్ కమిషన్
- రాష్ట్రంలో మూడు కుటుంబ పార్టీలు
- ముస్లీం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
- ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం
- జనగామ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అవినీతిలో నెంబర్ వన్ గా ఎదిగిన సిఎం కేసీఆర్ను రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే జైలుకు పంపిస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. రాష్ట్రంలో కేసీఆర్ అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించారు. కేసీఆర్ మిషన్ అంటే కమిషన్ అంటూ విమర్శించారు.
జనగామలో సోమవారం బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో అమలు చేసిన మిషన్ భగీరథ, పాస్ పోర్టు స్కీం, మియాపూర్ భూముల కుంభ కోణం, ఔటర్ రింగ్ రోడ్డు, కాళేశ్వరంలో 40వేల కోట్ల అవినీతి, మద్యం అమ్మకాలు, గ్రానైట్, మిషన్ కాకతీయలో 12వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు.
మూడు కుటుంబ పార్టీలు
బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కుటుంబ పార్టీలని అమిత్ షా విమర్శించారు. టూజీ, త్రీజీ,4జీ పార్టీలుగా విమర్శించారు. టూ జీ అంటే కేసీఆర్, కెటీఆర్, త్రీజీ అంటే సలాఉద్దీన్ ఓవైసీ, అససుద్దీన్, అక్బరొద్దీన్ లని, 4 జీ అంటే నెహౄ, ఇందిరగాందీ, రాజీవ్, రాహుల్ గాంధీ అంటూ మండిపడ్డారు.బీజేపీ ఏ జీ కాదని, తెలంగాణ ప్రజల పార్టీ అంటూ పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ చేపడుతాం
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సామాజిక న్యాయం కోసం, రానున్న రోజుల్లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించామని అమిత్ షా అన్నారు. రానున్న రోజుల్లో మాదిగ సమాజానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారి వర్గీకరణ చేస్తామని ప్రకటించారు.
మోదీ అంటెనే విశ్వగురుగా ఎదిగారన్నారు. జీ20 నిర్వహించి దేశాన్ని ప్రపంచం ముందు ఉన్నతస్థానంలో నిలబెట్టారని చెప్పారు. బానిస చిహ్నాలను కాదని, కొత్త పార్లమెంట్ నిర్మించారని చెప్పారు. చంద్రయాన్ పేరుతో చంద్రుని వరకు చేరుకున్నామన్నారు.
ముస్లీం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ముస్లీంలకు ఉన్న 4శాతం ఉన్న రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, బీసీలకు పెంచుతామని అమిత్ షా అన్నారు. పసుపు బోర్డు ప్రకటించి రైతులకు ఉపయోగకరమైన పనిచేశామన్నారు. ఇక్కడపండించే 2కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని క్వింటాల్ రూ.3100కు కొంటామని ప్రకటించారు. ఫసల్ భీమా ను తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. గరీబ్ మహిళలకు ఉచితంగా నాలుగు సిలిండర్లు అందజేస్తామన్నారు.
10లక్షల వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ ఎన్నికలు దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుగా అమిత్ షా వర్ణించారు. బైరాన్ పల్లిలో రజాకార్ల దాడిలో బలైన వారికి జోహార్లు అర్పిస్తున్నానని ప్రకటించారు.తెలంగాణకు రజాకార్లు, నిజాం నుంచి సర్ధార్ వల్లభ భాయ్ పటేల్ విముక్తి కల్పించారు. ఓవైసీతో జతకూడి విమోచన దినోత్సవాన్ని నిర్వహించడంలేదని విమర్శించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. బైరాన్ పల్లి, పరకాల అమరవీరులను స్మరించుకునేందుకు రజాకార్ దుశ్చర్య దినంగా జరుపుకుందామన్నారు. బైరాన్ పల్లిలో అమరవీరుల సంస్మర స్థూపాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జనగామకు పాలిటెక్నిక్ ఏర్పాటు చేస్తానని చెప్పి విస్మరించారని అన్నారు. బీఆర్ఎస్ కు చెందిన గత ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్ధి భూకబ్జాదారులని మండిపడ్డారు.
ఉచిత రామ మందిర దర్శనం
అయోధ్యలో రామ మందిరం కావాలా? వద్దా? జనవరి 22న రామమందిరంలో ప్రాణప్రతిష్ట చేయనున్నామని అమిత్ షా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం రాగానే అయోధ్య రామమందిర దర్శనం చేయిస్తామన్నారు. బీజేపీని గెలిపించాలని కోరారు. 2024లో మోదీని మూడవసారి ప్రధానిని చేద్దామా? అంటు నినదించారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్ అభ్యర్ధులు అరుట్ల దశమంతరెడ్డి, లేగ రామ్మోహన్ రెడ్డి, డాక్డర్ విజయరామారావులను గెలిపించాలని సభకు పరిచయం చేశారు. సభకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు.
